
ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలి
నిర్మల్చైన్గేట్: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనిస్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్రూమ్, రైతు రుణమాఫీ వంటి సమస్యలు పరిష్కరించాలని 61 అర్జీలు, 4 టెలీ కాల్స్ వచ్చాయి. ప్రజావాణి కార్యక్రమం అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ప్రజావాణి కార్యక్రమమంలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా రిమార్కుల విభాగంలో పొందుపర్చాలని తెలిపారు. దరఖాస్తుదారులకు వివరాలు తెలియజేయాలని సూచించారు.
నాలుగు టెలీ కాల్స్
అధిక ఉష్ణోగ్రతల కారణంగా జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజల కోసం టెలిఫోన్ ప్రజా వాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురు ఫోన్ చేసి సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దరఖాస్తు వివరాలను వాట్సప్ ద్వారా స్వీకరించి ప్రజావాణిలో నమోదుకు సంబంధించి రశీదును సంబంధిత వ్యక్తులకు వాట్సప్ ద్వారా అందించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కుల బహిష్కరణ నుంచి విముక్తి కలిగించాలి
మేము ఖానాపూర్ మండలం రాంరెడ్డిపల్లికి చెందిన వడ్డెర కులస్తులం. గతంలో వీడీసీ సభ్యులు చెప్పిన మాట వినలేదని సామాజిక బహిష్కరణ పేరుతో మా కుటుంబాన్ని ఐదేళ్లుగా వేధిస్తున్నారు. ఎస్పీ జానకీ షర్మిల, కలెక్టర్ అభిలాష అభినవ్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సామాజిక బహిష్కరణ ఉందని దుకాణదారు సరకులు ఇవ్వడం లేదు, ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ కార్డును కూడా లాక్కున్నారు. స్వయం సహాయక సంఘాల గ్రూపులో తీసుకున్న రుణానికి డబ్బులు చెల్లించినా తీసుకోవడం లేదు. మా కుటుంబంతో ఎవరైనా సత్సంబంధాలు పెట్టుకుంటే వారికి రూ.5 వేల జరిమానా విధిస్తామని గ్రామస్తులను హెచ్చరించారు.
– కుంచపు విజయ, ఎల్లయ్య, రాంరెడ్డిపల్లి
డీఎంఈ ఉద్యోగులుగా పరిగణించాలి
కొన్నేళ్లుగా జిల్లా ఆస్పత్రిలో వివిధ విభాగాలలో మేము విధులు నిర్వహించాం. ఇటీవల జిల్లాకు మెడికల్ కాలేజీ రావడంతో జిల్లా ఆస్పత్రి డీఎంఈ పరిధిలోకి వెళ్లింది. డీఎంఈ పరిధిలో ఉన్న ఈ ఆసుపత్రిలో 52 పోస్టులు భర్తీ చేస్తామని నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే మేము విధులు నిర్వహిస్తున్నందున మాకు వెయిటేజీ మార్కులతోపాటు మొదటి ప్రాధాన్యత ఇస్తానని గతంలో మాట ఇచ్చారు. కానీ ఇటీవల నియామకాలలో ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ వేరే వారికి ఉద్యోగాలు కల్పించారు. అధికారులు స్పందించి మా అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని మమ్మల్ని డీఎంఈలో కొనసాగేలా చూడాలి.
– ఔట్సోర్సింగ్ ఉద్యోగులు
అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
ప్రజావాణికి 61 అర్జీలు, 4 ఫోన్ కాల్స్
బీసీ భవన్ ఏర్పాటు చేయాలి
నిర్మల్ జిల్లాలో అత్యధిక జనాభా బీసీలే. జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటుకు స్థలంతోపాటు నిర్మాణానికి నిధులు కేటాయించాలి. దీంతోపాటు మహత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఏర్పాటు చేయాలి.
– మనోజ్ యాదవ్,
బీసీ విద్యార్థి సంఘం నాయకులు
సర్వే నంబర్ ఆన్లైన్లో చూపించడం లేదు..
మాది ఖానాపూర్ మండలం బాదన్కుర్తి. నాకు గ్రామ శివారులో 271 సర్వే నంబర్లో ఎకరం 6 గుంటల భూమి ఉంది. మిస్సింగ్ సర్వే నంబర్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నాను. అధికారులు నా సమస్యను పరిష్కరించి నా భూమికి సంబంధించి కొత్త పాస్ బుక్ అందజేయ గలరు.
– బర్లపాట రాజేశ్వర్, బాదన్కుర్తి

ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలి

ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలి

ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలి

ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలి