పచ్చని చెట్టే.. ప్రాణం | - | Sakshi
Sakshi News home page

పచ్చని చెట్టే.. ప్రాణం

Apr 13 2025 12:11 AM | Updated on Apr 13 2025 12:11 AM

పచ్చన

పచ్చని చెట్టే.. ప్రాణం

నిర్మల్‌: ఒక మొక్క నాటామంటే.. కేవలం మొక్కను పెంచుతున్నట్లు కాదు. మన ప్రాణం రక్షించుకుంటున్నట్లు.. ప్రాణవాయువును పెంచుకుంటున్నట్లు. మన జీవనాధారానికి ప్రాణం పోస్తున్నట్లు. బిడ్డను ప్రేమతో పెంచినట్లు పచ్చని చెట్టును సాకితే, అది ఆక్సిజన్‌, నీడ, పండ్లతో మీకు తిరిగి ఇస్తుంది. అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేస్తూ మనమే మన ఆయుష్సును తగ్గించుకుంటున్నాం. ఇటీవల సుప్రీం కోర్టు కూడా ఇదే విషయం వెల్లడించింది. ఈ తీర్పు మనలో చెట్ల పట్ల బాధ్యతను గుర్తు చేస్తోంది. జిల్లాలోనూ చెట్ల నరికివేతను అడ్డుకుని, హరితవనాలను పెంచాలి. ఒక చెట్టు నాటితే బిడ్డను పెంచినంత ఆనందం.. భవిష్యత్‌కు భరోసా లభిస్తాయి.

చెట్టు.. మన చుట్టం

చెట్టు మనకు ఆక్సిజన్‌, ఆహారం, నీడను అందిస్తుంది. జగదీశ్‌చంద్ర బోస్‌ చెట్లలో ప్రాణముందని నిరూపించారు. కానీ, అడవులను నరికి, పచ్చదనాన్ని నాశనం చేస్తూ గ్లోబల్‌ వార్మింగ్‌, కాలుష్యం, వర్షాభావాన్ని కొనితెచ్చుకుంటున్నాం. చెట్టు లేనిదే మనిషి బతకలేడని అర్థం చేసుకోవాలి.

జిల్లాలో చెట్ల నరికివేత

అడవుల ఖిల్లాగా పేరున్న నిర్మల్‌ జిల్లాలో అటవీ విస్తీర్ణం తగ్గుతోంది. అధికారుల లెక్కల ప్రకారం 33శాతం వరకు జిల్లాలో అడవులు ఉన్నాయి. రెండు దశాబ్దాల్లో నాటిన చెట్ల కంటే నరికినవే ఎక్కువ. మామడ, సారంగపూర్‌, కుంటాలలో ఒకప్పుడు దట్టమైన అడవులు ఉండేవి. ఇప్పుడు అవి పంటభూములుగా మారాయి. దస్తురాబాద్‌లో హరితవనంలో మొక్కల నరికివేత, మైసంపేట ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 10,067 చెట్ల నరికివేత కేసులు నమోదయ్యాయి.

చెట్ల రక్షణ.. అందరి బాధ్యత..

ప్రాణవాయువును ఇచ్చే చెట్లను లైట్‌గా తీసుకోవద్దు. ఓ మొక్కను పెంచడం చాలాకష్టం. అదే చెట్టును నరకడం చాలా ఈజీ. కానీ.. ఆ చెట్టు మనకు ఎంత మేలు చేస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. అటవీశాఖ అనుక్షణం చెట్ల రక్షణ కోసం పనిచేస్తోంది. ఎక్కడ అడవులు, చెట్ల నరికివేతలు చేస్తున్నట్లు తెలిసినా వెంటనే చర్యలు చేపడుతున్నాం. సుప్రీంకోర్టు చెప్పినట్లు చెట్లను కాపాడుకోవడం మనందరి బాధ్యత. – నాగినిభాను, డీఎఫ్‌వో

చెట్టంటే.. మనిషితో సమానమే.. ఒక్కచెట్టు నరికితే.. రూ.లక్ష జరిమానా ఇటీవల సుప్రీం కోర్టు సంచలన తీర్పు పర్యావరణ ప్రేమికుల హర్షం మన బాధ్యతనూ మనం గుర్తించాలి..

వివరాలు..

జిల్లాలో భూవిస్తీర్ణం: 3,56,251 హెక్టార్లు

అటవీ విస్తీర్ణం: 1,21,660.20 హెక్టార్లు

అటవీ శాతం: 33.08

చెట్ల నరికివేత,కలప తరలింపు కేసులు..

ఖానాపూర్‌ డివిజన్‌ : 5,865

నిర్మల్‌ డివిజన్‌ :4,202

ఇది కదా.. చెట్టంటే..!

ఈ ఒక్క ఫొటో చాలదా..!? చెట్టు విలువ ఏంటో చెప్పడానికి. నోరున్న మనకై నా.. ఆ మూగజీవాలకై నా ఎలాంటి తేడా చూపకుండా పచ్చని ప్రేమను పంచుతోంది. లోకేశ్వరం చెరువు పక్కనున్న ఈ చెట్టు ఏళ్లుగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజసేవ చేస్తోంది. అందుకే.. చెట్టు మనకు దగ్గరి చుట్టం. దాన్ని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు.

హైదరాబాద్‌లో నిరసనలు

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) వద్ద వందల ఎకరాల్లో చెట్లను తొలగిస్తున్నారని స్థానికులు, పర్యావరణవేత్తలు నిరసన తెలిపారు. ఈ చర్యలు వన్యప్రాణులకు ముప్పు తెచ్చాయని ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ తొలగింపును ఆపాలని ఆదేశించడంతో నిరసనకారులు ఆనందం వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు

ఉత్తరప్రదేశ్‌లోని మధుర–బృందావన్‌లో 454 చెట్లను చట్టవిరుద్ధంగా నరికినందుకు సుప్రీంకోర్టు రూ. 4.54 కోట్ల జరిమానా విధించింది. ఒక్కో చెట్టుకు రూ.లక్ష జరిమానాతో, పచ్చదనాన్ని కాపాడాలని గట్టి సందేశమిచ్చింది. ఈ తీర్పు పర్యావరణ ప్రేమికులను ఉత్తేజపరిచింది.

పచ్చని చెట్టే.. ప్రాణం 1
1/2

పచ్చని చెట్టే.. ప్రాణం

పచ్చని చెట్టే.. ప్రాణం 2
2/2

పచ్చని చెట్టే.. ప్రాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement