
పేదలపై పన్నులు.. సంపన్నులకు రాయితీలు
నిర్మల్చైన్గేట్: ప్రస్తుత ప్రభుత్వాలు పేదలపై పన్నులు వేస్తూ సంపన్నులకు రాయితీలు ప్రకటిస్తున్నాయని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కె.రాజన్న అన్నారు. వంట గ్యాస్ ధరలు రూ.50, డీజిల్ ,పెట్రోల్పై రూ.2 సుంకం పెంచడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట కట్టెల పొయితో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కె.రాజన్న మాట్లాడుతూ పెంచిన ధరలు తగ్గించకపోతే అన్ని పార్టీలు సంఘాలతో కలిపి పోరాటం చేస్తామన్నారు. అంతర్జాతీయంగా డీజిల్ గ్యాస్ ధరలు తగ్గినా దేశంలో ధరలు పెంచి ప్రజలపై భారం వేయడం దుర్మార్గమన్నారు. ఈ చర్యలతో నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్నాయని, నిరుద్యోగం ఆకలి, దారిద్రం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలను అదుపు చేయకుండా వ్యవహరిస్తున్నారన్నారు. నిరసనలో నాయకులు ఎం.బక్కన్న, ఆర్.రామలక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రేష్మ, దేవక్క పాల్గొన్నారు.