
డీఫ్యాక్టో సీఎం మీనాక్షి నటరాజన్
● రేవంత్రెడ్డి డమ్మీ సీఎం ● బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్చైన్గేట్: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ డీఫ్యాక్టో సీఎంలా వ్యవహరిస్తున్నారని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవా రం మాట్లాడారు. మీనాక్షి నటరాజన్ నేరుగా సచి వాలయానికి వచ్చి మంత్రులతో కలిసి హైదరాబా ద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారాన్ని సమీక్షించడం ద్వారా రేవంత్రెడ్డి డమ్మీ సీఎం అని చెప్పకనే చెప్పారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పగ్గాలను రాహుల్గాంధీ తన చేతిలోకి తీసుకున్నట్టు అర్థమవుతోందన్నారు. కాంగ్రెస్ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న కొత్తలో మీనాక్షి నటరాజన్ ప్రభుత్వ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనని చెప్పిన విషయం గుర్తు చేశారు. కానీ అందుకు విరుద్ధంగా ఏకంగా సచివాలయానికి రావడం వెనక రాహుల్గాంధీ ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హైదరాబాద్లోనే తన నివాసంలో ఉండగా మీనాక్షి నటరాజన్ ఏకంగా సచివాలయానికి వచ్చి మంత్రులతో కలిసి రివ్యూ చేయడం ద్వారా సీఎం రేవంత్రెడ్డి కోరలు లేని పాము అని అర్థం చేసుకోవాలన్నారు. జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ తమ విధానమంటున్న కాంగ్రెస్ పార్టీ.. ఆచరణలో శూన్యమని మీనాక్షి నటరాజ్ నిరూపించారని ఎద్దేవా చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జీలుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, గులామ్ నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, వయలార్ రవి వంటి నేతలు ఏనాడు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సర్కారును రాహుల్గాంధీ రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపించాలనుకుంటున్నారని విమర్శించారు. సకల జనులు కోట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చులకన చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ పాదాల వద్ద తాకట్టు పెట్టడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్నించుకోలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మార్పు వస్తుందన్నారు. ఇదేనా మార్పు, రిమోట్ కంట్రోల్ పాలనేనా మార్పు అంటే అని ఎద్దేవ చేశారు. సమావేశంలో బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, తాజా మాజీ కౌన్సిలర్లు నరేందర్, నవీన్, పద్మాకర్, సత్యం చంద్రకాంత్ , ముత్యంరెడ్డి, జమాల్, విలాస్, విజయ్, తిరుమలాచారి, ముత్యం పాల్గొన్నారు.