యుద్ధ నౌకల్లో మహిళా అధికారుల నియామకం

Women Officers To Be Posted On Indian Navy Warship - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత నౌకాదళంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. లింగసమానత్వాన్ని పునర్నిర్వచిస్తూ యుద్ధనౌకల్లో తొలి మహిళా అధికారులుగా సబ్‌ లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి, రితిసింగ్‌లు అడుగుపెట్టనున్నారు. భారత నౌకా దళంలో పలు ర్యాంకుల్లో ఎంతోమంది మహిళా అధికారులున్నా యుద్ధనౌకల్లో వీరి నియామకం ఇదే తొలిసారి. ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉండటం, సిబ్బంది క్వార్టర్లలో ప్రైవసీ ఇబ్బందులు, మహిళలు, పురుషులకు ప్రత్యేక బాత్‌రూంల కొరత వంటి పలు కారణాలతో ఇప్పటివరకూ యుద్ధ నౌకల్లో మహిళా అధికారులను నియోగించలేదు.

ఈ ఇద్దరు మహిళా అధికారులు వివిధ అంశాల్లో శిక్షణ పొందారు. నౌకాదళం​ అమ్ములపొదిలో చేరనున్న అత్యాధునిక ఎంహెచ్‌-60ఆర్‌ హెలికాఫ్టర్లలో వీరు విధులు నిర్వహిస్తారని భావిస్తున్నారు. ఎంహెచ్‌-60ఆర్‌ హెలికాఫ్టర్లు శత్రు దేశాల నౌకలు, సబ్‌మెరైన్లను గుర్తిస్తాయి. 2018లో అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ లాక్‌హీడ్‌-మార్టిన్‌ నిర్మించిన ఈ హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేశారు. కాగా రఫేల్‌ యుద్ధవిమానాలకు ఎంపిక చేసిన పైలట్లలో ఓ మహిళా పైలట్‌ను ఐఏఎఫ్‌ నియమించేందుకు సన్నద్ధమైన నేపథ్యంలో నేవీలో ఇద్దరు మహిళా అధికారుల నియామకం సైన్యంలో మహిళలకు సమ ప్రాతినిథ్యం దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలు పంపింది. చదవండి : విశాఖ గూఢచర్యం కేసు.. మరొకరి అరెస్ట్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top