ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఐదు రోజుల వ్యవధిలో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అత్యంత అరుదైన కేసుగా వైద్యులు అభివర్ణించారు. సాధారణంగా ఇలాంటి ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు హై-రిస్క్ గర్భధారణల కారణంగా సిజేరియన్ (సి-సెక్షన్) శస్త్రచికిత్స అవసరమవుతుంది. కానీ.. మొరాదాబాద్లోని తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ ఆసుపత్రిలో ఈ నలుగురు పిల్లలు సాధారణ కాన్పు ద్వారా జన్మించడం ఒక అసాధారణ కేసుగా ఆశ్చర్యపరుస్తోంది.
అమీనాగా అనే ఆ మహిళకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, నవజాత శిశువులు ఇద్దరూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. వారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. అల్ట్రాసౌండ్ స్కాన్లలో నలుగురు పిండాలు ఉన్నట్లు నిర్ధారణ అయినప్పటి నుండి.. ఈ గర్భధారణ అత్యంత సంక్లిష్టమైనది వైద్యులు చెప్పారు. దీనివల్ల ఉండే ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని.. కనీసం ఇద్దరు పిల్లలనైనా సురక్షితంగా ప్రసవించే అవకాశాలను పెంచడం కోసం "ఫీటల్ రిడక్షన్" (పిండాల సంఖ్యను తగ్గించడం) చేయాలని వైద్య బృందం సలహా ఇచ్చింది. అయితే నలుగురు పిల్లలతోనే గర్భాన్ని కొనసాగించాలని ఆ కుటుంబం నిర్ణయించుకుంది.
గర్భధారణ సమయంలో అమీనా రక్తపోటు (బీపీ), కాలేయ సంబంధిత (లివర్) సమస్యలతో కూడా బాధపడ్డారు. దీంతో ఆమె చికిత్స కోసం పలుమార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఆసుపత్రి పరిపాలన విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. మే 8వ తేదీన అమీనాకు మొదటిసారి నొప్పులు వచ్చాయి. మే 9న ఆమె తన మొదటి కుమారుడికి జన్మనిచ్చింది. ఆ శిశువు బరువు సుమారు 710 గ్రాములు ఉంది.
ఆ సమయంలో గర్భం ఇంకా ఆరున్నర నుండి ఏడు నెలల దశలోనే ఉండటంతో, వైద్యులు ఆమె పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. మిగిలిన ప్రసవాలను ఆలస్యం చేయగలిగారు. ఐదు రోజుల తర్వాత.. మే 14న ఆమెకు మళ్లీ ప్రసవ వేదన రావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఆమె మిగిలిన ముగ్గురు పిల్లలకు (ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు) జన్మనిచ్చింది. నవజాత శిశువులలో ఒకరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, మిగిలిన ఇద్దరు ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారని వైద్యులు తెలిపారు.
ఈ కేసు వైద్యపరంగా అత్యంత అరుదైనదని.. సవాలుతో కూడుకుందని ఆసుపత్రి వైద్య బృందం పేర్కొంది. నలుగురు పిల్లలు వేర్వేరు సంచులలో (separate sacs) ఉన్నారని, దీనివల్ల సాధారణ ప్రసవాలు విజయవంతం కావడం వైద్యపరంగా అత్యంత అసాధారణమైన విషయమని వైద్యులు చెప్పారు. ఈ చికిత్స, పర్యవేక్షణలో వైద్యుల బృందంతో పాటు పలువురు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. సకాలంలో స్పందించడం, నిరంతర పర్యవేక్షణ, కుటుంబ సభ్యుల సహకారం ఈ హై-రిస్క్ గర్భధారణను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాయని వైద్యులు తెలిపారు. పిల్లల తండ్రి, కిరాణా దుకాణం యజమాని మహ్మద్ ఆలిమ్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.


