భర్త చనిపోయిన బాధలో అంజలి.. ఆస్తి కోసం ఆమెకు మద్యం తాగించి.. | UP Woman Anjali Death Over Property Row | Sakshi
Sakshi News home page

భర్త చనిపోయిన బాధలో అంజలి.. ఆస్తి కోసం ఆమెకు మద్యం తాగించి..

Apr 13 2025 1:15 PM | Updated on Apr 13 2025 1:23 PM

UP Woman Anjali Death Over Property Row

లక్నో: భూమికి సంబంధించిన డబ్బు వివాదంలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. ఆమెకు మద్యం తాగించి తర్వాత గొంతుకోసి మృతదేహాన్ని యమునా నదిలో పడేశారు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో అంజలి(28) జీవిస్తోంది. తన భర్త చనిపోవడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి వద్దే ఉంటోంది. కాగా, అంజలి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శివేంద్ర యాదవ్‌ మధ్య ఓ భూమికి సంబంధించి కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. అంజలికి శివేంద్ర యాదవ్‌ డబ్బు ఇవ్వాల్సి ఉండగా.. ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాడు. దీంతో, తనకు రావాల్సిన డబ్బులు వెంటనే ఇవ్వాలని అంజలి డిమాండ్‌ చేయడంతో శివేంద్ర తప్పించుకునేందుకు ప్లాన్‌ చేశాడు. అంజలిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ నేపథ్యంలో మరో వ్యక్తి గౌరవ్‌తో కలిసి అంజలిని హత్య చేసేందుకు శివేంద్ర ప్లాన్‌ చేసుకున్నాడు. ఇంతలో అంజలికి ఫోన్‌ చేసి.. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని తన ఇంటికి రావాలిని శివేంద్ర చెప్పాడు. అతడి మాటలు నమ్మిన అంజలి.. అక్కడికి వెళ్లడంతో.. వారిద్దరూ కలిసి ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం, గొంతు కోసి హత్యచేసి మృతదేహాన్ని యమునా నదిలో పడేశారు. ఈ క్రమంలో గత ఐదు రోజులుగా అంజలి కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులకు.. ఫోన్ ట్రాకింగ్‌, స్కూటీ ఆధారంగా యుమునా నది వద్ద ఉన్నట్టు తేల్చారు. దర్యాప్తులో భాగంగా శివేంద్ర, గౌరవ్‌.. ఆమెను హత్య చేసినట్టు గుర్తించారు.

దీంతో, వారిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన తీరులో విచారించగా.. అంజలిని తామే హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. భూమి వివాదంలో అంజలి పదేపదే డబ్బులు అడుగుతున్న కారణంగానే హత్య చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం అంజలి మృతదేహాన్ని నదిలో నుంచి బయటకు తీశారు. ఆమెను చూసిన కుటుంబ సభ్యులు, అంజలి బిడ్డలు కన్నీటి పర్యంతమవుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోవడంతో బోరున విలపిస్తున్నారు. ఇదే సమయంలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement