ఉత్తరాదిలో యూకే వేరియంట్‌ | UK Variant Dominates North India | Sakshi
Sakshi News home page

ఉత్తరాదిలో యూకే వేరియంట్‌

May 7 2021 3:57 AM | Updated on May 7 2021 3:57 AM

UK Variant Dominates North India - Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కోవిడ్‌కు కారణమయ్యే సార్స్‌–కోవ్‌–2 వైరస్‌లో కొత్త రకాలు వెలుగులోకి వస్తున్నాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో పుట్టిన కొత్త రకం(యూకే వేరియెంట్‌) ప్రస్తుతం ఉత్తర భారతదేశంపై పంజా విసురుతోందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(ఎన్‌సీడీసీ) డైరెక్టర్‌ సుజిత్‌ చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లో డబుల్‌ మ్యుటెంట్‌ వ్యాప్తి అధికంగా ఉందన్నారు. దేశంలో ఉత్తరాది మినహా ఇతర ప్రాంతాల్లో యూకే వేరియంట్‌ (బీ1.1.7) ప్రభావం గత నెలన్నర రోజుల్లో గణనీయంగా పడిపోయిందన్నారు. యూకే వేరియంట్‌ కరోనా పాజిటివ్‌ కేసులు పంజాబ్‌లో 482, ఢిల్లీలో 516, మహారాష్ట్రలో 83, కర్ణాటకలో 82, తెలంగాణలో 192 బయటపడ్టాయని వెల్లడించారు.  

కేవలం మహారాష్ట్రలో బ్రెజిల్‌ రకం వైరస్‌
డబుల్‌ మ్యుటెంట్‌ వేరియంట్‌ (బి.1.617) కేసులు మహారాష్ట్రలో 761, పశ్చిమ బెంగాల్‌లో 124, ఢిల్లీలో 107, గుజరాత్‌లో 102 నమోదయ్యాయని సుజిత్‌ సింగ్‌ గుర్తుచేశారు. ఇక దక్షిణాఫ్రికా వేరియంట్‌ (బి.1.315) తెలంగాణ, ఢిల్లీలోనే అధికంగా కనిపిస్తోందని తెలిపారు. బ్రెజిలియన్‌ వేరియంట్‌(పీ1) మహారాష్ట్రలోనే స్వల్పంగా ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో దాని ఉనికి కనిపించలేదన్నారు. కొత్త వేరియంట్లు బయటపడే జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, వైరస్‌ నియంత్రణ చర్యలను పటిష్టం చేయాలని అన్ని రాష్ట్రాలకు సుజిత్‌ సింగ్‌ సూచించారు. కాంట్రాక్టు ట్రేసింగ్‌ చాలా ముఖ్యమంత్రి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement