పీఓకేలో నిరసనల హోరు | Thousands protest in POK Gilgit Baltistan | Sakshi
Sakshi News home page

పీఓకేలో నిరసనల హోరు

Jun 3 2025 4:58 AM | Updated on Jun 3 2025 9:45 AM

Thousands protest in POK Gilgit Baltistan

గిల్గిత్‌–బాల్టిస్తాన్‌లో మరింత ఎగసిన ఆగ్రహ జ్వాల 

తమ వ్యాపార ప్రయోజనాలను పాక్‌ సర్కార్‌ పణంగా పెట్టిందని వ్యాపారుల ఆగ్రహం 

చైనా సరిహద్దు కారాకోరమ్‌ హైవేను దిగ్బంధించిన స్థానిక దిగుమతి, ఎగుమతిదారులు 

మరింత ఉధృతమవుతున్న గిల్గిత్‌–బాల్టిస్టాన్‌ స్థానికుల ఉద్యమం

గిల్గిత్‌: ఆపరేషన్‌ సిందూర్‌తో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్‌కు స్థానిక వ్యాపారులు నిరసనల సెగ మరింత తగులుతోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లోని గిల్గిత్‌–బాల్టిస్టాన్‌లోని స్థానిక వ్యాపారులు తమ స్వప్రయోజనాలను పాక్‌ ప్రభుత్వం పణంగా పెడుతోందని ఆందోళన బాటపట్టారు. వీళ్లకు స్థానిక రాజకీయ పారీ్టల మద్దతు సైతం తోడవడంతో ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. 

గత మూడు రోజులుగా స్థానిక సరకు ఎగమతి, దిగుమతిదారులు, చిరు వ్యాపారు లు ఆందోళన కొనసాగిస్తున్నారు. స్థానిక గుల్మార్ట్‌ నగర్‌లో వేలాది మంది వ్యాపారులు, స్థానికులు బైఠాయించి నిరసనకు దిగారు. చైనా, పాకిసాŠత్‌క్‌ ఎకనమిక్‌ కారిడార్‌(సీపీఈసీ)లో కలికితురాయి వంటి కారాకోరమ్‌ జాతీయ రహదారిని గత మూడు రోజులుగా వ్యాపారులు దిగ్బంధించారు. దీంతో పాక్, చైనా మధ్య భారీ సరకు రవాణా వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆందోళన కార్యక్రమాల్లో అధికార పీఎంఎల్‌(నవాజ్‌) పారీ్టకి చెందిన నేతలు సైతం పాల్గొన్నారు.

 ఫెడరల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రెవిన్యూ(ఎఫ్‌బీఆర్‌) నిర్ణయాలు పూర్తి లోపభూయిష్టంగా ఉన్నాయని, కేవలం చైనాకు లబి్ధచేకూర్చేలా ఆర్థిక విధానాలను అవలంభిస్తున్నారని సరకు ఎగుమతి, దిగుమతిదారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. చైనా దోపిడీ విధానాలు పాకిస్తాన్‌ను ఆర్థికంగా హత్య చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యాపారులకు తోడుగా హూంజా, సమీప పట్టణాల నుంచి వేలాదిగా విద్యావేత్తలు, పౌర సంఘాల ప్రతినిధులు తరలివచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 

2023 అక్టోబర్‌లోనూ గిల్గిత్‌–బాల్టిస్తాన్‌ ప్రజలు భారత్‌ అనుకూల ఉద్యమం చేశారు. భారత్‌లోని కార్గిల్‌ను కలిపే రోడ్డును మళ్లీ తెరవాలని, తద్వారా సరకు దిగుమతులకు అనుమతించి స్థానికంగా ద్రవ్యోల్బణాన్ని కిందకు దిగొచ్చేలా చేయాలని స్థానికులు ఉద్యమించారు. ‘సరిహద్దులు చెరిపేయండి, కార్గిల్‌ సరిహద్దును తెరవండి’’అంటూ ప్రముఖ కార్యకర్త షబ్బీర్‌ మయ్యార్‌ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగడడం తెల్సిందే. తర్వాత ఆయనను ఉగ్రవ్యతిరేక చట్టం కింద పాక్‌ సర్కార్‌ అరెస్ట్‌చేసింది.  

పరస్పర నిందారోపణలు 
గిల్గిత్‌–బాల్టిస్తాన్‌లో ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ అధికారంలో ఉందని, ఫెడరల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రెవిన్యూ(ఎఫ్‌బీఆర్‌) నిర్ణయాలతో తమకు సంబంధంలేదని పీఎంఎల్‌(నవాజ్‌) పార్టీ చెబుతోంది. ‘‘పీటీఐ పార్టీ విధానాల కారణంగా స్థానికంగా వ్యాపారం దెబ్బతింటోంది. ఎగుమతిదారులు, వ్యాపారులు, దుకాణదారులు, కారి్మకులు, కస్టమ్స్‌ క్లియరెన్స్‌ ఏజెంట్లు, హోటళ్లు, చిరువ్యాపారులు అందరూ ఆరు నెలలుగా తీవ్రంగా నష్టపోతున్నారు. 

స్థానిక ప్రభుత్వం ఏకంగా ఉగ్రవాదులకే క్షమాభిక్షలు పెట్టింది. కనీసం వ్యాపారులను పట్టించుకోరా?’’అని పీఎంఎల్‌(నవాజ్‌) పార్టీ నేత జావేద్‌ హుస్సేన్‌ ప్రశ్నించారు. హుస్సేన్‌ వ్యాఖ్యలను పీటీఐ పార్టీ నేతలు ఖండించారు. ‘‘ఫెడరల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రెవిన్యూ అనేది కేంద్రప్రభుత్వానికి సంబంధించిన విషయం, మా ప్రభుత్వంతో సంబంధం లేదు’’అని గిల్గిత్‌–బాల్టిస్తాన్‌ ముఖ్యమంత్రి కార్యాలయం అధికార ప్రతినిధి మొహమ్మద్‌ అలీ ఖయీద్‌ చెప్పారు. ఇరు ప్రభుత్వాల నడుమ వ్యాపారులు ఆర్థిక చితికిపోతున్నారు. సరకుల కొరతతో ధరలు పెరిగి సామాన్యులు ఆరునెలలుగా అల్లాడిపోతున్నారు.  

కస్టమ్స్‌ క్లియరెన్సుతో.. 
సరిహద్దుల్లోని సోస్త్‌ డ్రై పోర్ట్‌ ద్వారా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులకు కస్టమ్స్‌ క్లియరెన్సు అనుమతులు ఇవ్వకపోవడంతో తాజాగా వ్యాపారులు నిరసనకు దిగారు. గత ఆరు నెలలుగా 257 కన్‌సైన్‌మెంట్లు ఇలా డ్రై పోర్ట్‌లోనే ఆగిపోయాయి. దీంతో కొంత సరకు పాడయింది. దీంతో వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారు. ఇదిగాక మిగిలిన సరకుకు సైతం రోజువారీ నిల్వ చార్జీలు ఇతరత్రాలు మోపడంతో వ్యాపారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ సరకుకు మోక్షం కల్గించేదాకా కారాకోరమ్‌ హైవేను తెరిచేదిలేదని వ్యాపారులు భీషి్మంచుకుని కూర్చున్నారు. నగర్, హూంజా, గిల్గిత్‌ ప్రాంతాలకు చెందిన గిల్గిత్‌–బాల్టిస్తాన్‌ దిగుమతి, ఎగుమతిదారుల సంఘం ఆధ్వర్యంలో పాక్‌–చైనా ట్రేడర్స్‌ యాక్షన్‌ కమిటీ నేతృత్వంలో ఈ ఉద్యమం కొనసాగుతోంది. హైవేపై రాకపోకలు ఆగిపోవడంతో ఇరువైపులా కిలోమీటర్ల కొద్దీ సరకు, ప్రయాణికుల వాహనాలు నిలిచిపోయాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement