మిసెస్ ఇండియా రన్నరప్‌గా తెలంగాణ మహిళ

Telangana Woman Kiranmay Won As Mrs India 2023 1st Runner Up - Sakshi

అందాల పోటీల్లో తొలిసారి తెలంగాణ మహిళ మెరిసింది. మిసెస్ ఇండియా 2023 పోటీల్లో తెలంగాణకు చెందిన కిరణ్మయి అలివేలు రన్నరప్‌గా నిలిచారు. రాజస్థాన్ వేదికగా జరిగిన పోటీల్లో ఆమె మొదటి రన్నరప్ గా నిలిచారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారిలో 50 మంది ఫైనల్ చేరుకోగా.. తుది పోటీల్లో కిరణ్మయి చక్కని ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచారు. మిసెస్ ఇండియా తెలంగాణ రీజనల్ డైరెక్టర్ మిసెస్ మమతా త్రివేదీ ఆమెకు మెంటర్‌గా వ్యవహరించారు.

వీణా పుజారి కిరణ్మయికి దుస్తులు డిజైన్ చేయగా... 10 కేటగిరీల్లో 30 మందితో పోటీపడ్డారు. టాలెంట్ రౌండ్ , డాన్స్ రౌండ్ , సఫారీ రౌండ్ తో పాటు ఫ్యాషన్ రౌండ్స్‌లో గట్టిపోటీ నడిచినప్పటికీ... జడ్జీలు అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానమిచ్చిన ఆకట్టుకున్నారు. ఇదే పోటీల్లో డైరెక్టర్ కేటగిరీకి సంబంధించి బెస్ట్ డైరెక్టర్ అవార్డును మమతా త్రివేదీ గెలుచుకున్నారు.

కిరణ్మయి గతంలో 2019 మిసెస్ ఇండియా తెలంగాణ ఎట్రాక్టివ్ టైటిల్ గెలిచారు. వివాహం తర్వాత కూడా మహిళలు కుటుంబానికే పరిమితం కాకుండా ఏదైనా సాధించొచ్చు అనేది రుజువు చేసే ఉధ్ధేశంతో మిసెస్ ఇండియా పోటీలకు సిద్ధమయ్యారు. దాదాపు 8 నెలల పాటు ప్రిపేర్ అయ్యి జాతీయ పోటీలకు అర్హత సాధించారు. జాతీయ పోటీల్లో తన అందంతో పాటు మాట్లాడే తీరు, టాలెంట్, క్రియేటివిటీ వంటి అంశాల్లో ప్రతిభ కనబరిచి రన్నరప్‌గా నిలిచారు.

మిసెస్ ఇండియా పోటీల్లో రన్నరప్‌గా ఒక తెలంగాణ మహిళ నిలవడం ఇదే తొలిసారి. కాగా ఈ విజయంపై కిరణ్మయి ఆనందం వ్యక్తం చేశారు. అందాల పోటీల్లో వివాహం తర్వాత కూడా మహిళలు రాణించొచ్చు అనుకునే వారికి తాను రోల్ మోడల్‌గా నిలవాలనే లక్ష్యంతోనే జాతీయ పోటీల్లో పాల్గొన్నానని కిరణ్మయి చెప్పారు. తెలంగాణ నుంచి మిసెస్ ఇండియా పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన కిరణ్మయిని పలువురు అభినందించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top