
దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ (వీటీ–ఏఎన్బీ) 171 విమాన ప్రమాదం దుర్ఘటనలో భయానక దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 12న మేఘానీ నగర్ బీజే మెడికల్ కాలేజీకి చెందిన ఐదంతస్తుల భవనాన్ని ఎయిరిండియా విమానం ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగే సమయంలో విమాన ప్రమాద భయం నుంచి తప్పించుకునేందుకు మెడికల్ కాలేజీ క్యాంపస్లోని మూడో అంతస్తునుంచి విద్యార్థులు కిందకి దూకి తప్పించుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింటకు చేరాయి.
బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని ఎయిరిండియా విమానం ఢీకొన్నాక వెలువడిన దిక్కులు పిక్కటిల్లే శబ్దంతో మూడో భవనంలో ఉన్న విద్యార్థులు ప్రాణ భయంతో హాస్టల్ బాల్కనీ నుంచి కిందకి దూకారు. తమ ప్రాణాల్ని రక్షించుకునే ప్రయత్నం చేశారు.
మెస్లో భోజనం చేస్తుండగా ఎయిరిండియా విమానం ఢీ కొట్టడంతో.. అప్రమత్తమైన విద్యార్థులు హాస్టల్ బాల్కనీ నుంచి బెడ్ షీట్లను వేలాదీస్తూ కిందకు దూకి ప్రాణాల్ని రక్షించుకునే భయనక దృశ్యాలు ప్రమాద తీవ్రతను గుర్తు చేస్తున్నాయి.
A distressing video has emerged showing medical students at BJ Medical College hostel in #Ahmedabad desperately jumping from balconies to escape following the catastrophic Air India #planecrash crash on June 12!!
Although no media is highlighting this..#MedTwitter pic.twitter.com/iBAqn8xngc— Indian Doctor🇮🇳 (@Indian__doctor) June 17, 2025
మాటలకందని పెనువిషాదం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. గత గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది.
కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్వే సమీపంలో మేఘానీనగర్లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.

230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్పై పడి పేలిపోయింది.
ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. దాంతో రెండు భవనాలూ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటితో పాటు పరిసరాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు కూడా మంటలంటుకుని కాలిపోయాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలామంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్వాసుల్లో కూడా పలువురు ప్రమాదంలో గాయపడ్డారు.
వారిలో కనీసం 25 మంది మరణించినట్టు చెబుతున్నారు! ఒక వైద్యుడు, నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, వైద్యుని భార్య మృతిని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ‘‘60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి’’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది.