ఆలయంలో తొక్కిసలాట | Stampede at Mansa Devi temple in Uttarakhand's Haridwar | Sakshi
Sakshi News home page

ఆలయంలో తొక్కిసలాట

Jul 27 2025 10:32 AM | Updated on Jul 28 2025 4:15 AM

Stampede at Mansa Devi temple in Uttarakhand's Haridwar

హరిద్వార్‌: పవిత్ర పుణ్యక్షేత్రం హరిద్వార్‌లో విషాదం జరిగింది. నగరంలో కొండపై ఉన్న ప్రసిద్ధ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది.  ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఆరు గురు మృతి చెందారు. 28 మంది గాయపడ్డారు. విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయన్న పుకారు తొక్కిస లాటకు దారి తీసిందని పోలీసులు తెలిపారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. 500 అడుగుల ఎత్తులో ఉన్న శివాలిక్‌ కొండలపైకి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 

ఇరుకైన ప్రవేశ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయన్న పుకారుతో ఒక్కసారిగా జనం తోసుకుంటూ అక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. వెంటనే సహాయ సిబ్బంది స్పందించి.. ఊపిరాడక స్పృహ కోల్పోయిన 34 మందిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురు మరణించారు. 

ఘటనపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి వెంటనే స్పందించారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. హరిద్వార్‌లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. వారి కుటుంబాలకు అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. 

 

 

రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..
ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించడం తీవ్ర బాధాకరం. బాధిత కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం. గాయపడిన భక్తులందరూ త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను’ అని రాష్ట్రపతి ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement