ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పొదుపు చర్యల్లో భాగంగా తన కాన్వాయిలోని కార్ల సంఖ్యను భారీగా తగ్గించనున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి కేవలం రెండు వాహనాల్లోనే తన కాన్వాయి ఉండనున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న వేళ పెట్రోల్, డీజీల్ వాడకం తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
అదే విధంగా పలువురు కేంద్రమంత్రుల కాన్వాయిలోని వాహనాల సంఖ్య సైతం భారీగా తగ్గింది. హోంశాఖ మంత్రి అమిత్ షా కాన్వాయి మూడు వాహనాలకు తగ్గగా రక్షణ శాఖ మంత్రి కాన్వాయి 11 వాహనాల నుంచి నాలుగు వాహనాలకు తగ్గించారు. కాగా ఇటీవల దేశ ప్రజలకు పొదుపు చర్యలు చేపట్టాలని ప్రధాని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని సైతం స్వయంగా ఆ నిబంధనలను పాటిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఇటీవల హైదరాబాద్లోని బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాని దేశానికి కీలక సూచనలు చేశారు. " పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్పై తీవ్రంగా పడింది. దీంతో పెట్రోల్, డీజీల్ ధరలు తీవ్రంగా పెరిగాయి. ప్రస్తుత కష్ట సమయాల్లో ప్రజలంతా సంయమనం పాటించాలి. విదేశీ ప్రయాణాలు, దుబారా ఖర్చులు పూర్తిగా తగ్గించుకోవాలి. పెట్రోల్, డీజిల్ను పరిమితంగా వినియోగించాలి. ప్రజా రవాణానే అధికంగా వాడాలి ఎలక్టిక్ వాహనాల వైపు మళ్లాలి" అని సూచించారు.


