
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా జూలై 2న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. యశ్వంత్ అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. 2న ఉదయం 11.30 గంటలకు నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకోనున్న యశ్వంత్ సిన్హా.. మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి ఎన్నికలో ఓటర్లుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు.
సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు ఈ భేటీకి అధ్యక్షత వహిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో లంచ్ భేటీ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో కాకుండా మరోచోట ఉంటుందని సమాచారం. ఎక్కడ సమావేశమయ్యేది ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని యశ్వంత్ సిన్హా ప్రచార కమిటీ సభ్యుడు, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా సిన్హాకు మద్దతునిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతోనూ ఆయన విడిగా భేటీ కానున్నారు.
చదవండి: Presidential Elections 2022: ప్రాతినిధ్యమే రాజకీయంగా కీలకం