Parliament Monsoon Session Updates: BJP, Oppn face-off Delhi ordinance bill - Sakshi
Sakshi News home page

Parliament Monsoon Session Live: లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుపై చర్చ రేపటికి వాయిదా

Aug 1 2023 11:34 AM | Updated on Aug 1 2023 4:14 PM

Parliament Sessions Updates BJP Oppn Face Off Delhi Ordinance Manipur - Sakshi

ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుపై చర్చ.. అప్‌డేట్స్‌

► ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాల రగడతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. 

► బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేపట్టింది.  కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని కాంగ్రెస్‌.. ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. 

► లంచ్‌ తర్వాత తిరిగి లోక్‌సభ ప్రారంభమైంది. సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లు వచ్చింది. ఇది సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్‌ ప్రకటించింది. అలాగే బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఆర్‌ఎస్‌పీ సైతం ప్రకటించింది.   

►పార్లమెంట్‌లో మణిపూర్ సంక్షోభంపై ప్రధాని మోదీ ప్రకటనకు పదే పదే డిమాండ్ చేసినా చైర్మన్ జగదీప్ ధంకర్ పట్టించుకోకపోవడంతో రాజ్యసభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.

► లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్‌ తేదీలు ఖరారు చేశారు. ఈనెల 8.9,10 తేదీల్లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది.  ఈనెల 10న ప్రధాన మోదీ సమాధానం ఇవ్వనున్నారు.

లోక్‌సభ ముందు ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లు
► ఢిల్లీలోని అధికారుల నియామకాలు, బదిలీకి సంబంధించిన ఆర్డినెన్స్‌ బిల్లును కేంద్రం నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును ఆప్‌, కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే మణిపూర్‌, అవిశ్వాసంపై రచ్చ జరుగుతున్న సభలో ఈ బిల్లుతో మరింత గందరగోళం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.

ఉభయ సభలు వాయిదా
► ప్రతిపక్షాల నిరసనలు, ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ప్రారంభమైన 16 నిమిషాల్లోనే లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు. ఇక రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు.

రూల్ 267 కింద చర్చకు మొండిపట్టు
► రాజ్యసభలో గందరగోళం నెలకొనడంతో రూల్ 267 కింద చర్చకు ప్రతిపక్షాలు సమర్పించిన 60 నోటీసులను చైర్మన్‌ తిరస్కరించారు. అయితే మణిపూర్‌ సంక్షోభంపై స్వల్పకాలిక చర్చకు  రూల్ 176 కింద నోటీసులను ఆమోదించారు.  

రాజ్యసభలో రచ్చ
► రూల్ 267 ప్రకారం మణిపూర్‌పై చర్చ జరగాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని పార్లమెంట్‌కు రావాలని, మణిపూర్‌పై  చేయాలని డిమాండ్‌ చేశాయి.  గత 8 రోజులుగా సభకు నిరంతర అంతరాయంపై చైర్మన్ జగదీప్ ధన్‌కర్ ప్రసంగిస్తున్న నేపథ్యంలో మణిపూర్ సంక్షోభంపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.

ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు
►మణిపూర్‌ ఘటనపై చర్చ చేపట్టాలని ఉభయసభల్లో విపక్ష ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. రాజ్యసభలో రూల్‌ 267 కింద మణిపూర్‌ అంశంపై చర్చ జరపాలని బీఆర్‌ఎస్‌ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు. వాయిదా తీర్మానం నోటీసులిచ్చారు.

లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు సమయం
లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలకు సమయం కేటాయించారు. వెంటనే ప్రతిపక్షాలు మణిపూర్‌ అంశంపై నిరసనలు తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు.

►పార్లమెంట్‌ సమావేశాలు మంగళవారం తిరిగి ప్రారంభమయ్యాయి.

►పార్లమెంట్‌లోని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో ప్రతిపక్ష ఎంపీలు సమావేశమయ్యారు. 

►ఢిల్లీ ఆర్డినెన్స్‌తో సహా ఆరు బిల్లులను లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో మణిపూర్ నిరసనలు మిన్నంటడంతో ఉభయ సభల కార్యకలాపాలు నిలిచిపోయాయి. జూలై 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గత ఎనిమిది రోజులుగా ముందుకు సాగడం లేదు. మణిపూర్‌ వ్యవహారంతో ఉభయసభలు అట్టుడుకుతున్నాయి. మణిపూర్‌ హింసపై ప్రధాని మోదీ సభలో ప్రకటన చేయడంతోపాటు, దీనిపై దీర్ఘకాలిక చర్చ జరగాలని ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేయడంతో.. లోక్‌సభ, రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. 
చదవండి: ఒకే వేదికపై ప్రధాని మోదీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్?

మణిపూర్‌పై చర్చకు సిద్ధమని ప్రభుత్వం తెలిపినప్పటికీ.. మొండి వైఖరితో విపక్షాలు ఆందోళనలు,  ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించడంతో ఉభయ సభల్లో అదే పరిస్థితి నెలకొంది.విపక్షాలకు సర్దిచెప్పేందుకు సభాపతులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఇరుసభలూ వరుసగా వాయిదా పడుతున్నాయి. మణిపూర్‌తోపాటు  అవిశ్వాసంపై వెంటనే చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. 

ఈ క్రమంలోనే అవిశ్వాస తీర్మానానికి బదులుగా మణిపూర్‌పై చర్చకు కేంద్రం సిద్ధమైంది. రూల్ 176 కింద స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వం చెబుతుండగా...ప్రతిపక్షం రూల్ 267 కింద చర్చకు పట్టుబట్టింది. చర్చకు ముందు ప్రధానమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్‌ చేసింది. దీంతో ఏకాభిప్రాయం కుదరకపోవడం, విపక్షాలు ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో సభను వాయిదా వేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement