
ఆ దేశంలోనే ఉన్న భర్త
పాక్కు వెళ్లడానికి ఇక్కట్లు
మైసూరు(కర్ణాటక): మైసూరులో పాకిస్తాన్కు చెందిన మహిళ స్వదేశానికి వెళ్లలేక ఇబ్బందులు పడుతోంది. పాకిస్తాన్లో ఉన్న తన భర్త పిలుచుకుపోతాడని ఆమె భారత్– పాకిస్తాన్ సరిహద్దులకు వెళ్లింది, కానీ భర్త రాకపోవడంతో ఒంటరిగా వెళ్లలేక ఉస్సూరంటూ మైసూరుకు తిరిగి వచ్చింది.
మైసూరులో నివాసం
వివరాలు.. మైసూరులోని ఉదయగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పాకిస్తాన్కు చెందిన మహిళ ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. 10 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ వ్యక్తితో వివాహమైంది. కొన్ని సంవత్సరాల పాటు భర్తతో కలిసి పాకిస్తాన్లో జీవించింది, పిల్లలు కూడా అక్కడే పుట్టారు. కొన్ని కారణాల వల్ల ఆమె, పిల్లలతో కలిసి మైసూరుకు వచ్చి ఉంటోంది.
పహల్గాంలో ఉగ్రవాదుల మారణహోమం తరువాత పాకిస్తాన్ పౌరులందరూ వారి దేశానికి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. ఫలితంగా ఆ మహిళ పాకిస్తాన్కు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. భర్తకు ఫోన్ చేయగా పిల్లలతో కలిసి సరిహద్దుల వద్దకు రా, నేను వచ్చి తీసుకెళ్తాను అని చెప్పాడు. ఆమె పిల్లలను వెంటేసుకుని సరిహద్దులకు వెళ్లింది. భర్తకు కాల్ చేయగా ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది. మళ్లీ మైసూరుకు తిరిగి వచ్చింది. ఆమె విజిటర్స్ వీసాతో మైసూరులో ఉంటోంది.