
తిరువనంతపురం: కేరళ,తమిళనాడు(Tamilnadu) తీరాలకు ‘కల్లక్కడల్’ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఇన్కాయిస్’ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. బుధవారం(జనవరి 15)న రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన రాకాసి అలలు తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది.
బుధవారం రాత్రి 11.30 గంటల వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో అర మీటరు నుంచి ఒక మీటరు మేర అలల తాకిడి ఉంటుందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (Incois) హెచ్చరించింది.
ఇన్కాయిస్ హెచ్చరిక నేపథ్యంలో కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ అప్రమత్తమైంది.తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని సూచించింది.ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న పడవలు పడవలు వేసుకొని సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.
మత్స్యకారులు ముందుగానే పడవలను సురక్షిత ప్రదేశానికి చేర్చుకోవాలని ప్రకటించింది. పర్యాటకులు బీచ్లలో విహారానికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.తీర ప్రాంతాలపై అదనపు నిఘా ఉంచాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది.
కల్లక్కడల్ అంటే ఏంటి..?
కల్లక్కడల్ అనేది మళయాలం పదం. కల్లక్కడల్ అంటే సముద్రం ఓ దొంగలా దూసుకొస్తుందని అర్థం. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో కొన్ని సార్లు వీచే బలమైన గాలులే సముద్రం ఇలా అకస్మాత్తుగా ఉప్పొంగడానికి కారణమని Incois వెల్లడించింది.ఎలాంటి సూచన,హెచ్చరిక లేకుండానే ఆ గాలులు వీస్తుంటాయని పేర్కొంది.అందుకే దీనిని స్థానికంగా ‘కల్లక్కడల్’ అని పిలుస్తారు.