కరోనాకు బ్రేకులు, ప్రగతిలో పరుగులు | Governor Said Govt Taken Appropriate Steps To Reduce Covid-19 | Sakshi
Sakshi News home page

కరోనాకు బ్రేకులు, ప్రగతిలో పరుగులు

Feb 15 2022 10:52 AM | Updated on Feb 15 2022 10:53 AM

Governor Said Govt Taken Appropriate Steps To Reduce Covid-19 - Sakshi

సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్‌ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుందని గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, జలవనరులు ఇలా అన్ని రంగాల్లో ప్రభుత్వం ప్రగతి సాధించిందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదట గవర్నర్‌ గెహ్లాట్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కోవిడ్‌ సవాళ్లను ప్రభుత్వం స్వీకరించి ఎదుర్కొందన్నారు. కరోనా నిర్వహణ, టీకా పంపిణీ సక్రమంగా చేసినట్లు చెప్పారు. ఆయన కన్నడ భాషలో ప్రసంగం ఆరంభించి తర్వాత హిందీలో మాట్లాడారు. వందేమాతరం గీతంతో సమావేశాలు ప్రారంభించారు.  

బెంగళూరులో మెరుగ్గా వసతులు..  

  • ఆరోగ్య రంగానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిందని గవర్నర్‌ అన్నారు. బెంగళూరు మెట్రో రైలు ఫేజ్‌ –2 పనులు 2022– 23 నాటికి పూర్తయి, ప్రజలకు సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు  
  • బెంగళూరుకు తాగునీటిని అందించేందుకు తిప్పగొండనహళ్లి జలాశయం పునఃప్రారంభించి నీటి శుద్ధీకరణ చేయనున్నట్లు తెలిపారు   
  • బెంగళూరు నగర మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.8 వేల కోట్లు కేటాయింపు. రాజధానిలో మెట్రో, బీఎంటీసీ, తాగునీరు, విద్యుత్‌ వసతులు మెరుగ్గా ఉన్నాయన్నారు.   
  • దివంగత ప్రముఖులకు సంతాపం..  
  • గవర్నర్‌కు అసెంబ్లీ వద్ద రాచ లాంఛనాలతో ఘన స్వాగతం పలికారు. సీఎం బొమ్మై, ఉభయ సభల స్పీకర్లు, మంత్రులు ఆయనకు స్వాగతం పలికి అసెంబ్లీలోకి తోడ్కొని వెళ్లారు. భారతరత్న లతా మంగేష్కర్‌తో పాటు ఇటీవల కాలంలో మరణించిన ప్రముఖులకి అసెంబ్లీలో  సంతాపం తెలిపారు.  

నల్లగుడ్డలతో కాంగ్రెస్‌ సభ్యులు..  
ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు చేతికి నల్ల బట్ట కట్టుకుని అసెంబ్లీకి వచ్చారు. హిజాబ్‌ – కేసరి శాలువా వివాదాన్ని నిరసిస్తూ నల్లగుడ్డ కట్టినట్లు తెలిపారు. రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం సరికాదన్నారు.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement