మూజువాణి ఓటుతో గహ్లోత్‌ గెలుపు

Gehlot Government Wins Motion Of Confidence - Sakshi

21కి రాజస్తాన్‌ అసెంబ్లీ వాయిదా

జైపూర్‌ : రాజస్తాన్‌ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. పాలక కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో మూజువాణి ఓటుతో గహ్లోత్‌ సర్కార్‌ నెగ్గింది. విశ్వాస పరీక్షపై ఓటింగ్‌ అనంతరం సభను ఈనెల 21 వరకూ వాయిదా వేస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషీ ప్రకటించారు. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ పార్టీ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంకలతో భేటీ అనంతరం తిరిగి పార్టీ గూటికి చేరడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని సులభంగా నెగ్గింది. తాను కాంగ్రెస్‌ తరపున పోరాడే శక్తివంతమైన యోధుడనని పేర్కొన్న సచిన్‌ పైలట్‌ ఎలాంటి విపత్కర పరిస్ధితుల్లోనూ పార్టీని కాపాడుకుంటానని చెప్పారు.

విశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్‌ మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌, మణిపూర్‌, గోవా రాష్ట్రాల్లో ధనం, అధికార బలం ప్రయోగించి ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేసిందని ఆరోపించారు. రాజస్తాన్‌లోనూ అదే ప్రయత్నం చేసిన కాషాయపార్టీ భంగపడిందని అన్నారు. ఇక 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్‌ అసెంబ్లీలో గహ్లోత్‌ సర్కార్‌కు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, బీజేపీ సంఖ్యాబలం 72గా ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు ముందు అశోక్‌ గహ్లోత్‌ మాట్లాడుతూ ఈరోజు అసెంబ్లీ భేటీ వాస్తవాలకు అద్దం పడుతుందని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఐక్యతకు సంకేతంగా నిలుస్తుందని..సత్యమేవ జయతే అంటూ ట్వీట్‌ చేశారు. చదవండి : రాజస్తాన్‌ అసెంబ్లీలో పైలట్‌ కీలక వ్యాఖ్యలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top