నదిలోకి తీసుకెళ్లి నీటిలో ముంచిన వైనం
విజయపుర జిల్లాలో వెలుగు చూసిన ఘోరం
సాక్షి,బళ్లారి: విజయపుర జిల్లాలో ఘోర దురంతం చోటు చేసుకుంది. తన పోలిక లేదనే అనుమానంతో సొంత కొడుకును నదిలోకి తీసుకెళ్లి ఓ తండ్రి నీటిలో ముంచి దారుణంగా చంపిన ఘటన జిల్లాలోని నాగఠాణ గ్రామంలో చోటు చేసుకుంది. నాగఠాణకు చెందిన సిద్ధార్థ (6) హత్యకు గురైన చిన్నారి. బాలుడు తండ్రి మల్లికార్జున అరకేరిని పలువురు మీ కుమారుడు సిద్ధార్థ చూడటానికి నీలాగా లేడని ఎద్దేవా చేసేవారు. దీన్ని రోజు వింటున్న మల్లికార్జున అక్కసుతో సొంత బిడ్డను నదిలో ముంచి చంపాడు. మహారాష్ట్రలోని కరాడ్ జిల్లా వడోలి వద్ద కృష్ణా నదిలోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
మార్చి 16న కుమారుడిని సదరు నదిలోకి తీసుకెళ్లి ముంచి చంపి తిరిగి ఊరికి వచ్చిన మల్లికార్జునను కొడుకు గురించి ఆరా తీయగా సింధగి వద్ద స్కూల్లో చేరి్పంచి హాస్టల్లో పెట్టానని నాటకమాడాడు. ఇక మే 1న సిద్ధార్థ్ పుట్టిన రోజు ఉంది. తీసుకొని రమ్మని తల్లి భాగ్యశ్రీ పట్టుబట్టింది. కొడుకు ఏడి? అని నిలదీయగా నిందితుడు మల్లికార్జున పరారయ్యాడు. దీంతో తల్లి భాగ్యశ్రీ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కుమారుడిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు తానే హత్య చేసినట్లు అంగీకరించాడని, దీంతో మల్లికార్జునను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


