న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రజలకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీపి కబురు అందించారు. మంగళవారం అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ₹1,03,700 కోట్లతో భారీ బడ్జెట్ను ఆమె ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రసంగం చేసిన సీఎం, సామాన్యులపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా హోలీ, దీపావళి పండుగల సందర్భంగా ప్రతి ఇంటికి ఒక ఉచిత ఎల్పీజీ సిలిండర్ను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కోసం బడ్జెట్లో రూ. 260 కోట్లను కేటాయించారు.
మౌలిక సదుపాయాలకు పెద్దపీట
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) కోసం రూ.11,666 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, నగర అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. గతంలో (2018-2020 మధ్య) ఉచిత పథకాల సంస్కృతి వల్ల ఆదాయం తగ్గిందని, అయితే ఇప్పుడు ఢిల్లీ తలసరి ఆదాయం దేశంలోనే మూడవ స్థానంలో ఉందని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. ఈ ఏడాది పన్నుల ద్వారా రూ.74,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.
బడ్జెట్లోని కీలక అంశాలు
రవాణా - రోడ్లు: పీడబ్ల్యూడీ (పీడబ్ల్యూడీ)రూ. ₹5,921 కోట్లు, రోడ్ల కోసం రూ.1,352 కోట్లు కేటాయించారు. సుమారు 750 కిలోమీటర్ల మేర రోడ్ల పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. విద్యుత్ రంగానికి రూ.3,942 కోట్లు, ఓవర్ హెడ్ వైర్ల తొలగింపుకు రూ. 200 కోట్లు కేటాయించారు. ఢిల్లీ జల బోర్డుకు రూ. 9,000 కోట్లు కేటాయిస్తూ, ట్యాంకర్ల అవసరం లేకుండా ఇంటింటికీ నీరు అందించడమే లక్ష్యమని సీఎం చెప్పారు.
అగ్నిమాపక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.674 కోట్లు కేటాయించారు. యమునా ప్రాంతానికి ₹300 కోట్లు, గ్రామీణ వికాస బోర్డుకు ₹787 కోట్లు కేటాయించారు. అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా ట్రాన్స్జెండర్లు, గిగ్ వర్కర్లు, కార్మికులతో ముందస్తుగా చర్చించి, వారి సూచనల మేరకు ఈ బడ్జెట్ను రూపొందించినట్లు సీఎం తెలిపారు. ఢిల్లీ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఒక రోడ్మ్యాప్ అని సీఎం రేఖా గుప్తా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: సీఎం ఇంటర్వ్యూకి రూ.11 లక్షలా?.. వివాదంలో హీరో మోహన్లాల్?


