కరోనా రిటర్న్స్‌! రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్‌, నిర్లక్ష్యం వద్దు.. ఛాన్స్‌ తీసుకోవద్దు

Corona Update: Centre Alerts States Amid Cases High South Asia - Sakshi

దేశంలో కరోనా కథ ముగిసినట్లే కనిపిస్తోంది పరిస్థితి. జన సంచారం మామూలు స్థితికి చేరుకుంది. అయితే గత రెండు వారాలుగా పరిస్థితి మారిపోయింది. ఇజ్రాయెల్‌లో కొత్త వేరియెంట్‌ బయటపడడం, చైనాలో ఊహించని స్థాయిలో కరోనా విజృంభణ-లాక్‌డౌన్‌, అమెరికాతో పాటు దక్షిణాసియా పరిధిలోని కొన్ని దేశాల్లో(దక్షిణ కొరియా, హాంకాంగ్‌లో పరిస్థితి మరీ దారుణం).. కొన్ని యూరప్‌ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో మన కేంద్రం..రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని జనాలు ఇస్టానుసారం తిరుగుతుండడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పొరుగు దేశాల్లో కేసుల విజృంభణనను ప్రస్తావిస్తూ.. ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గురువారం ఓ లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌. కరోనా వైరస్‌ విషయంలో నిర్లక్ష్యం పనికి రాదని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ.. ఐదు దశల స్ట్రాటజీ.. టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, అవసరమైన చర్యలు, వ్యాక్సినేషన్‌  పాటించాలంటూ ఆ లేఖలో కేంద్రం సూచించింది. 

ఐసీఎంఆర్‌, ఎన్‌సీడీసీ National Centre for Disease Control (NCDC) ప్రొటోకాల్స్‌ పాటిస్తూ.. టెస్టులు చేస్తుండాలని తెలిపింది. అంతేకాదు కేసుల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని, ఇన్‌ఫెక్షన్‌ల తీవ్రత సోకకుండా నియంత్రించాలని సూచించారు లేఖలో. కంటోన్మైట్‌, క్లస్టర్‌, డేంజర్‌ జోన్‌లను అవసరమైతే ఏర్పాటు చేయాలని కోరింది. 

ముఖ్యంగా పబ్లిక్‌ ప్లేసుల్లో మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం, శుభ్రతా తదితర సూచనలను నిర్లక్ష్యం చేయొద్దని సూచించింది. ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేసిన గైడ్‌లెన్స్‌ల గురించి ప్రస్తావించిన కేంద్రం.. పరిస్థితులకు తగ్గట్లు ఆర్థిక వ్యవహారాల కొనసాగింపునకు అనుమతులు ఇవ్వాలంటూ మరోసారి గుర్తు చేసింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాన్షుక్‌ మాండవియా అధ్యక్షతన మార్చి 16వ తేదీన హై లెవల్‌ మీటింగ్‌ జరిగింది. ఈ భేటీలో పలు దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండడంపై చర్చించారు. ఆపై మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖను రిలీజ్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. కరోనాలో కొవిడ్‌ కేసుల తగ్గుముఖం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2, 528 కేసులు నమోదు అయ్యాయి. మరణాలు 149గా ఉన్నాయి. యాక్టివ్‌ కేసులు 29, 181గా ఉంది. దాదాపు 685 రోజుల తర్వాత 30 వేలకు దిగువన యాక్టివ్‌ కేసుల గణాంకం నమోదు అయ్యింది. భారత్‌లో ఇప్పటిదాకా కరోనా కేసులు 4, 30, 04,005 నమోదు కాగా, మరణాల సంఖ్య 5, 16, 281గా ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top