కేంద్ర విపత్తు సాయం రూ. 4381 కోట్లు | Central Disaster Relief Rs 4381 Crores For 6 States | Sakshi
Sakshi News home page

కేంద్ర విపత్తు సాయం రూ. 4381 కోట్లు

Nov 13 2020 2:09 PM | Updated on Nov 13 2020 2:15 PM

Central Disaster Relief Rs 4381 Crores For 6 States - Sakshi

న్యూ ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ శుక్రవారం ఆరు రాష్ట్రాలకు అదనపు విపత్తు సహాయం కింద రూ.4381.88 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఉంపున్ తుఫాన్ సహాయం కింద అత్యధికంగా బెంగాల్ రాష్ట్రానికి రూ. 2,707.77 కోట్లను అందజేయనుంది. అస్పాం రాష్ట్రానికి 128.23 కోట్లు, జూన్‌లో నిసర్గ తుఫాన్‌కి నష్టపోయిన మహరాష్ట్రకు రూ.268.59 కోట్లు, వరదలతో దెబ్బతిన్న కర్ణాటక రాష్ట్రానికి రూ.577.84 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.611.61 కోట్లు, సిక్కింకు రూ.87.84 కోట్లుగా ప్రకటించింది. ఈ నిధులన్ని జాతీయ విపత్తు సహాయనిధి ద్వారా ఆయా రాష్ట్రాలకు అందజేయనున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది ఉంపున్, నిసర్గ తుఫాన్లు, వరదలు, కొండచరియలు విరిగిపడ్డ విపత్తులతో పలు రాష్ట్రాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. వీటిలో  మే నెలలో పశ్చిమ బెంగాల్‌, అస్సాం రాష్ట్రాలలో వచ్చిన ఉంఫున్‌ తుఫాను ధాటికి 100 మంది చనిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సుమారు 6 లక్షల పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మే 20న తూర్పు తీర ప్రాంతంలోని సుందర్‌బన్‌ అడవుల్లో 20 కిలోమీటర్ల మేర భూమి కుంగిపోయింది. 185 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. కొన్ని చోట్ల రోడ్లు కోతకు గురవగా, మరి కొన్ని చోట్ల పాడయ్యాయి. తుఫాన్‌  వచ్చిన మరుసటి రోజు ప్రధానమంత్రి ఆ రాష్ట్రాలకు పర్యవేక్షణకు వెళ్లి, తక్షణ సహాయంగా పశ్చిమ బెంగాల్‌కు రూ.1000 కోట్లు, ఒడిశాకు రూ. 500 కోట్లు తక్షణ సహాయంగా అందజేశారు. తుఫాన్‌ చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి 50000 ఎక్స్‌గ్రేషియాను అందజేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ సహాయం కన్నా ఎక్కువ.

Advertisement
 
Advertisement
Advertisement