
న్యూఢిల్లీ: జనాభా లెక్కలకు(census) ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ లెక్కలు దేశాభివృద్ధికి పలు విధాలుగా దోహదపడనున్నాయి. తదుపరి దేశ జనాభా గణన 2027, మార్చి ఒకటి నుంచి ప్రారంభం కానున్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిలో కుల గణనతో పాటు కీలకమైన సామాజిక, ఆర్థిక వివరాలను సేకరించనున్నారు.
ఈ జనాభా గణన 2026 అక్టోబర్ నుంచే లడఖ్, జమ్ముకశ్మీర్(Jammu and Kashmir), హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాలలో ప్రారంభం కానుంది. జనగణనను రెండు దశల్లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పురుషులు, మహిళల గణాంకాలతో పాటు, వారి కులం, ఉపకులాలపై ప్రభుత్వం సమాచారం సేకరించనుంది. కులాల వారీగా జనాభా గణన చేయడం వలన ఎవరెవరికి వాస్తవంగా సరైన అవకాశాలు లభిస్తున్నాయో, ఎవరు ఇంకా వెనుకబడి ఉన్నారో లాంటి విషయాలు వెల్లడి కానున్నాయి. విద్య, ఉపాధి, ఆరోగ్యం, ప్రభుత్వ సహాయాలు తదితర అంశాల్లో సమానత్వాన్ని తీసుకొచ్చేందుకు ఇది ఎంతో కీలకంగా మారనుంది. దీని ఆధారంగానే ప్రభుత్వం విధానాలను రూపొందించాల్సి ఉంటుంది.
కుల గణనకు పలు రాజకీయ పార్టీలు మద్దతునిస్తున్నాయి. దేశంలో చివరిసారి అధికారికంగా కులాల వారీగా జనాభా గణన 1931లో చేపట్టారు. ఆ తర్వాత 1941లో మళ్లీ చేయాలనుకున్నా, రెండో ప్రపంచ యుద్ధం కారణంగా కులగణన నిర్వహించలేకపోయారు. దీంతో నాటి గణనలే ఇప్పటికీ రిఫరెన్స్ పాయింట్గా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో 2011లో కుల గణన జరిగింది. అయితే ఇది పూర్తి వివరాలతో బయటకు రాలేదు. 1948 జనాభా చట్టం ప్రకారం వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచాలి. ఈ కారణంగానే నాటి గణాంకాలపై స్పష్టత రాలేదు.
ఇది కూడా చదవండి: గూఢచర్యం కేసులో మరో యూ ట్యూబర్ అరెస్ట్