
న్యూఢిల్లీ: పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా(Travel vlogger Jyoti Malhotra)ను అరెస్టు చేసిన దరిమిలా, తాజాగా పంజాబ్ పోలీసులు మరో యూట్యూబర్ను అరెస్టు చేశారు. పంజాబ్కు చెందిన జస్బీర్ సింగ్ ‘జాన్మహల్ వీడియో’ అనే యూట్యూబ్ ఛానెల్ను నడుపుతున్నారు. ఇతని ఛానల్కు పది లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. పంజాబ్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్స్ సెల్ జస్బీర్ను రూప్నగర్లో అరెస్టు చేసింది.
జస్బీర్ సింగ్(Jasbir Singh) గతంలో ఉగ్రవాద మద్దతు కలిగిన షకీర్ అలియాస్ జట్ రాంధావా అనే పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధికారితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తున్నదని పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గౌరవ్ యాదవ్ పేర్కన్నారు. పాకిస్తాన్ హైకమిషన్ అధికారి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్తో కూడా జస్బీర్ సింగ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన మీడియాకు చెప్పారు. జస్బీర్ మూడుసార్లు పాకిస్తాన్ను సందర్శించాడని, అతని ఫోనులో లెక్కకు మంచిన పాకిస్తానీ నంబర్లు ఉన్నాయన్నారు. అవి ఇప్పుడు ఫోరెన్సిక్ దర్యాప్తులో ఉన్నాయని తెలిపారు.
డానిష్ ఆహ్వానం మేరకు ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో జరిగిన పాకిస్తాన్ జాతీయ దినోత్సవ కార్యక్రమానికి జస్బీర్ హాజరయ్యారని, జ్యోతి మల్హోత్రా అరెస్టు తర్వాత, జస్బీర్ తన దగ్గరున్న పాకిస్తాన్ సమాచారాన్ని తుడిచివేయడానికి ప్రయత్నించాడని డీజీపీ యాదవ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సైనిక కదలికలపై సున్నితమైన సమాచారాన్ని పాక్తో పంచుకున్నారనే ఆరోపణలతో జస్బీర్ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: ‘సింధూర్’ సమయంలో ప్రధాని మోదీ ఏం చేశారంటే..