
బంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మందికి పైగా గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు తెలిపారు. మృతుల్లో 7గురు మైనర్లు సహా 5గురు మహిళలు కూడా ఉన్నారు. గలకతి సదర్ జిల్లా పరిధిలో చత్రకాండ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
బస్సు భండారియా ఉపజిల్లా నుంచి ఫిరోజ్పూర్కు వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలో ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను ఝలకతి జిల్లా ఆస్పత్రికి తరలించారు. బస్సులో 60-70 మంది ప్రయాణికులు ఉండటం మృతుల సంఖ్య పెరగడానికి కారణమైనట్లు తెలుస్తోంది. డ్రైవర్ వేగంగా బస్సును నడపడమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి: విమానంలో టాయిలెట్ వాడొద్దన్న సిబ్బంది.. రెండు గంటలు అలాగే..