కోల్‌కతా ఘటన: సందీప్‌ ఘోష్‌ పాత్రపై కొత్త ఆరోపణ! | BJP points letter Sandip Ghosh ordered renovation near crime scene | Sakshi
Sakshi News home page

కోల్‌కతా ఘటన: సందీప్‌ ఘోష్‌ పాత్రపై కొత్త ఆరోపణ!

Sep 5 2024 6:41 PM | Updated on Sep 5 2024 8:21 PM

BJP points letter Sandip Ghosh ordered renovation near crime scene

కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్‌ హాస్పిటల్‌లో జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.​ ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆర్జీ కర్‌ హాస్పిటల్‌ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్‌పై బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ తాజాగా తీవ్రమైన ఆరోపణలు చేశారు.  మరుసటి హత్యాచారం జరిగిన సెమినార్‌ హాల్‌ వద్ద మరమత్తు పనులు జరిపించాలని సందీప్‌ ఘోష్‌ ఆదేశాలు జారీచేశారని అన్నారు. దానికి సంబంధించిన ఓ ఆర్డర్‌ లెటర్‌ను సైతం విడుదల చేశారాయన.

‘‘ఆగస్ట్‌ 10వ తేదీన ఈ ఆర్డర్‌పై ఆర్జీ కర్‌ హాస్పిటల్‌ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ సంతకం చేశారు. అంటే కేవలం జూనియర్‌ డాక్టర్‌ మృతిచెందిన మరుసటి రోజే. ఈ ఆర్డర్‌ను పరిశీలిస్తే.. మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   క్రైం సీన్‌లోని  ఆధారాలను తారుమారు చేశారని ఇప్పటికే ఆర్జీ కర్‌ ఆస్పత్రిలోని డాక్టర్లు, నిరసన తెలిపే వైద్య సిబ్బంది ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను మాత్రం పోలీసులు కమిషనర్ ఖండించారు’’అని తెలిపారు.

‘‘ ఆర్జీ కర్‌  హాస్పిటల్‌లోని వివిధ విభాగాలలో ఆన్-డ్యూటీ  డాక్టర్ల గదులు, ప్రత్యేక అటాచ్డ్ టాయిలెట్లలో మరమత్తు పనులు చేయవల్సిందిగా కోరుతున్నా. రెసిడెంట్స్ డాక్టర్ల డిమాండ్ మేరకు అవసరమైన పనులుచేయండి’’ అని సందీప్‌ ఘోష్‌ పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు రాసిన లేఖలో ఉండటం గమనార్హం.

మరోవైపు..మృతురాలి తల్లిదండ్రులు రాష్ట్ర పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసును అణిచివేసేందుకు పోలీసులు తమకు లంచం ఇవ్వాలని చూశారని ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, సమగ్ర దర్యాప్తు లేకుండా కేసును మూసివేయడానికి యత్నించారని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement