Ayodhya Teacher Murder Case Solved After UP CM Yogi Orders - Sakshi
Sakshi News home page

సీఎం యోగి ఆదేశాలు.. ఎట్టకేలకు వీడిన ప్రభుత్వ టీచర్‌ మర్డర్‌ మిస్టరీ

Jul 4 2022 6:52 PM | Updated on Jul 4 2022 7:32 PM

Ayodhya Teacher Murder Case Solved After UP CM Yogi Orders - Sakshi

అయోధ్యలో గర్భిణీ హత్య కేసుపై ప్రతిపక్షాలు సీఎం యోగిపై విమర్శలు గుప్పించాయి.

లక్నో: అవును.. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ఆదేశాలతోనే ఆ మర్డర్‌ కేసులో మిస్టరీ వీడింది. అయోధ్య పర్యటనలో ఉండగా స్థానికంగా ఓ గర్భిణి హత్య గురించి విని ఆయన ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించగా.. విమర్శల నడుమే ఎట్టకేలకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఆ కేసు చిక్కుముడి విప్పారు. 

అయోధ్య కోట్‌వాలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శ్రీరాంపురం కాలనీలో జూన్‌ 1వ తేదీన ప్రభుత్వ ఉపాధ్యాయిని సుప్రియా వర్మ(35) దారుణ హత్యకు గురైంది. పదునైన ఆయుధంతో ఎవరో ఆమె వీపుభాగంలో పొడిచి చంపి.. దొపిడీకి పాల్పడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నారు. పైగా ఆమె ఐదు నెలల గర్భవతి. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించగా.. ఆదేరోజు అయోధ్య పర్యటనలో ఉన్న సీఎం యోగికి విషయం తెలిసింది. వెంటనే ఆయన ఉత్తర ప్రదేశ్‌ డీజీపీకి ఆయన ఆదేశాలు జారీ చేశారు. 

ఆధారాలేవీ దొరక్కపోవడంతో ఈకేసులో విచారణ కష్టతరంగా మారింది. ఈ తరుణంలో.. రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. స్వయంగా సీఎం యోగి ఆదేశించినా ఫలితం లేకుండా పోయిందంటూ ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ విమర్శించారు. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలో టీషర్టు ధరించిన ఓ యువకుడిని గుర్తించారు. ఆ కంపెనీ టీషర్టుల ఆన్‌లైన్‌ డెలివరీల మీద ఆరా తీసి.. చివరికి నిందితుడిని పట్టేశారు. 

శారీరక సంబంధమే!
అంబేద్కర్‌నగర్‌ జిల్లా పథాన్‌పూర్‌ ఎట్రావులికి చెందిన సుప్రియా వర్మ.. పోస్టింగ్‌ రిత్యా అయోధ్యలో ఉంటోంది. ఆమె భర్త ఉమేష్‌ వర్మ కూడా ప్రభుత్వ టీచరే. ఈ క్రమంలో స్థానికంగా ఉంటున్న ఓ మైనర్‌తో ఆమె సంబంధం నడిపించింది. అయితే ఆమె గర్భం దాల్చడంతో భయపడ్డ మైనర్‌.. ఎలాగైనా ఆ సంబంధం తెంచుకోవాలనుకున్నాడు. కానీ, ఆమె మాత్రం అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో.. కుటుంబం పరువు పోతుందని భయపడ్డ ఆ కుర్రాడు దారుణానికి తెగబడ్డాడు. 

హత్యను దోపిడీగా చిత్రీకరించేందుకు.. ఇంట్లో నుంచి యాభై వేల రూపాయల నగదును, ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్లాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సీఎంవో కార్యాలయానికి అందజేసినట్లు అయోధ్య డీఐజీ ఏకే సింగ్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement