ఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఏపీకి తగిన నిధులు కేటాయించలేదన్నారు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి. పోలవరం ప్రాజెక్టు నిధులు తగ్గడంతో పాటు ఆ ప్రాజెక్టు ఎత్తు 41.15మీటర్లకే పరిమితం చేశారన్నారు. ‘కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేలేకపోయింది. వైజాగ్కు హైస్పీడ్ రైట్ కారిడార్ కేటాయింపు జరగాలి. జగన్ ప్రభుత్వ పాలనను ఎకనామిక్ సర్వే కీర్తించింది. జగన్ పాలనలో డిజిటల్ ల్యాండ్ సర్వే అద్భుతంగా చేశారని వెల్లడించింది. రాష్టానికి హై స్పీడ్ రైల్ కారిడార్ రాలేదు. గ్రామీణాభివృద్ధికి నిధులు తగ్గాయి. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. గ్రామీణ సడక్ యోజన పథకానికి నిధులు పెంచాలి’ అని పేర్కొన్నారు.
రాష్ట్రాలపై భారం వేస్తున్నారు
వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే దురాలోచన చేస్తున్నారని, రాష్ట్రాలపై భారం వేస్తున్నారన్నారు. పేదల చేతికి నిధులు అందితేనే మనీ సర్క్యులేషన్ జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలపై నిర్లక్ష్యం వహించడం దురదృష్టకరమన్నారు. పోలవరంకు అరకొర నిధులు కేటాయించడమే కాకుండా ఆ ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్ల లెవెల్కు తగ్గించారన్నారు. ఇదిలాగే కొనసాగితే పోలవరం పూర్తికి పదేళ్లు పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తగిన శ్రద్ధ పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి. ఈ కేటాయింపులు సవరించాలి’ అని పేర్కొన్నారు.

పోలవరంకు నిధులు తగ్గించడం అన్యాయం
బడ్జెట్ లో పోలవరంకు నిధులు తగ్గించడం అన్యాయమన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మేడా రఘునాథ్రెడ్డి. కూటమి ప్రభుత్వం రాష్ట్నానికి తగిని నిధులు తీసుకురాలేదన్నారు. లడ్డూ విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని తేలిందని మేడా రఘునాథ్రెడ్డి స్పష్టం చేశారు.
కేంద్ర బడ్జెట్ ఏపీకి నిరాశే మిగిల్చింది
కేంద్ర బడ్జెట్ ఏపీకి నిరాశే మిగిల్చిందన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్రెడ్డి. పోలవరంకు 57 వేల కోట్ల రూపాయలను 30 వేల కోట్లకు తగ్గించారన్నారు.27 వేల కోట్ల రూపాయల గ్రాంట్ ను రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని అవినాష్రెడ్డి స్పష్టం చేశారు. ‘పోలవరం ఎత్తు తగ్గించారు... నిధులు తగ్గించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనం వల్లే ఈ పరిస్థితి. చంద్రబాబు నాయుడు మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసి రాష్ట్ర ప్రజల పై భారం మోపుతున్నారునేరాలు అరికట్టాల్సిన పోలీసులే...నేరాలను దగ్గరుండి చేయిస్తున్నారు. అంబటి రాంబాబు బండిని అడ్డగించి మారణాయుదలతో దాడి చేయించారు. ఆ తర్వాత ఇంటిపై టీడీపీ ఎమ్మెల్యే దాడికి దిగారు. రాష్ట్రానికి నిధులు తగ్గితే...మాట్లాడని కేంద్ర మంత్రి దాడులకు పురికొల్పుతున్నారు’ అని మండిపడ్డారు.
ఏపీలో గుండాల రాజ్యం నడుస్తోంది
మరో వైఎస్సార్సీపీ ఎంపీ గొల్లబాబూ రావు మాట్లాడుతూ.. ‘ ఏపీలో గుండాల రాజ్యం నడుస్తోంది. అంబటి రాంబాబును చంపాలని ప్రయత్నం చేశారు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు లేదన్న విషయాన్ని డైవర్ట్ చేసేందుకు దాడులు చేస్తున్నారు. దీనిపై ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు. బడ్జెట్ లో స్టీల్ ప్లాంట్ పై ప్రస్తావన లేదు. ముఖ్యమైన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు.


