దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి దిశగా నడిపించే లక్ష్యంతో రూపొందించిన 2026-27 కేంద్ర బడ్జెట్ మౌలిక సదుపాయాల కల్పన, రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. మొత్తం రూ.53.47 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో కొన్ని రంగాలు అగ్రస్థానంలో నిలిచాయి.
కీలక రంగాల కేటాయింపులు (రూ.కోట్లలో)
రవాణా: రూ. 5,98,520 కోట్లు
రక్షణ: రూ. 5,94,585 కోట్లు
గ్రామీణాభివృద్ధి: రూ. 2,73,108 కోట్లు
హోం వ్యవహారాలు: రూ. 2,55,234 కోట్లు
వ్యవసాయం & అనుబంధ రంగాలు: రూ. 1,62,671 కోట్లు
విద్య: రూ. 1,39,289 కోట్లు
ఇంధనం: రూ. 1,09,029 కోట్లు
ఆరోగ్యం: రూ. 1,04,599 కోట్లు
పట్టణాభివృద్ధి: రూ. 85,522 కోట్లు
ఐటీ అండ్ టెలికాం: రూ. 74,560 కోట్లు
వాణిజ్యం & పరిశ్రమలు: రూ. 70,296 కోట్లు
సాంఘిక సంక్షేమం: రూ. 62,362 కోట్లు
శాస్త్ర సాంకేతిక విభాగాలు: రూ. 55,756 కోట్లు
పన్ను పరిపాలన: రూ. 45,500 కోట్లు
విదేశీ వ్యవహారాలు: రూ. 22,119 కోట్లు
ఆర్థిక శాఖ: రూ. 20,649 కోట్లు
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి: రూ. 6,812

బడ్జెట్లో అత్యధికంగా రవాణా రంగానికి రూ.5.98 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా హైవేలు, రైల్వేలు, పోర్టుల ఆధునీకరణపై ప్రభుత్వం తన పట్టును చాటింది. దీనికి సమాంతరంగా రక్షణ రంగానికి రూ.5.94 లక్షల కోట్లు కేటాయించారు. సరిహద్దు భద్రతతో పాటు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ రక్షణ పరికరాల తయారీకి ఈ నిధులు ఊతమివ్వనున్నాయి.
గ్రామీణ భారతం, వ్యవసాయం
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.2.73 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.1.62 లక్షల కోట్లు కేటాయించడం విశేషం. రైతుల ఆదాయం పెంచడం, డిజిటల్ అగ్రి-స్టాక్ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ఈసారి ప్రత్యేక దృష్టి సారించారు.
విద్య, ఆరోగ్యం, ఐటీ
మానవ వనరుల వికాసానికి ప్రాధాన్యత ఇస్తూ విద్యకు రూ.1.39 లక్షల కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.1.04 లక్షల కోట్లు కేటాయించారు. రాబోయే కాలంలో టెక్నాలజీ పాత్రను గుర్తిస్తూ ఐటీ, టెలికాం రంగానికి రూ.74,560 కోట్లు కేటాయించడం డిజిటల్ ఇండియా వేగాన్ని పెంచనుంది.
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026 సమగ్ర స్వరూపం..


