Amit Shah Jammu And Kashmir Tour: అమిత్ షా కశ్మీర్ పర్యటన
Published
Sat, Oct 23 2021 11:09 AM
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ (అక్టోబర్ 23) కశ్మీర్ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమిత్ షా తొలిసారిగా కశ్మీర్ పర్యటనకు వెళ్తుండటం విశేషం. శ్రీనగర్ నుంచి షార్జాకు తొలి అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభం అవుతున్న వేళ అమిత్ షా.. కశ్మీర్ లోయలో పర్యటనకు వెళ్తున్నారు.
పర్యటనలో భాగంగా అమిత్ షా కశ్మీర్లో అంతర్గత భద్రతను సమీక్షించనున్నారు. ఇటీవల పెరిగిన చొరబాట్లు, పౌరుల హత్యల నేపథ్యంలో అమిత్ షా పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. ఈ పర్యటనలో అమిత్ షా కశ్మీర్ సర్పంచ్లతో సమావేశం కానున్నారు. త్వరలోనే కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిపే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదాను 2019 ఆగస్టు 5న రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. లడఖ్, జమ్ము అండ్ కశ్మీర్లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన సంగతి తెలసిందే.
అమిత్ షా మూడు రోజుల పర్యటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు అక్కడి అధికారులు. ఇటీవల స్థానికేతరులన్న కారణంగా కొందరు అమాయక పౌరులను తీవ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. అమాయక పౌరులను టార్గెట్ చేస్తున్న ముష్కరులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా అక్కడ పర్యటనకు వెళ్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.