సముద్రంలో బిక్కుబిక్కు | 37 Indian-flagged ships and 1109 sailors stranded as Strait of Hormuz closes | Sakshi
Sakshi News home page

సముద్రంలో బిక్కుబిక్కు

Mar 4 2026 4:20 AM | Updated on Mar 4 2026 4:20 AM

37 Indian-flagged ships and 1109 sailors stranded as Strait of Hormuz closes

పర్షియన్‌ గల్ఫ్‌లో చిక్కుకున్న 37 భారత నౌకలు, 1,109 మంది సిబ్బంది  

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారత నౌకలు పర్షియన్‌ గల్ఫ్, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌తోపాటు పరిసర సముద్ర జలాల్లో చిక్కుకుపోయాయి. భారతదేశ జెండాలతో కూడిన మొత్తం 37 నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఆయా నౌకల్లో 1,109 మంది సిబ్బంది ఉన్నారు. ఇజ్రాయెల్‌–అమెరికా, ఇరాన్‌ మధ్య దాడులు ప్రతిదాడుల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హొర్మూజ్‌ జలసంధిని మూసివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వీటిలో కొన్ని నౌకల్లో ముడి చమురు, సహజ వాయువు ఉన్నాయి. అవి భారత ఓడరేవులకు చేరుకోవాల్సి ఉంది.

మరికొన్ని నౌకలు పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేయడానికి గల్ఫ్‌ దేశాలకు ప్రయణిస్తుండగా మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. భారత ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ షిప్పింగ్‌’గల్ఫ్‌ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. నౌకల్లో చిక్కుకుపోయిన భారతీయ సిబ్బందికి సహాయం అందించడానికి కేంద్ర షిప్పింగ్‌ శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా, ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఖమేనీ మరణం తర్వాత గల్ఫ్‌ సముద్ర తీరంలో విదేశీ జెండాలు ఉన్న నౌకలపై పలు దాడులు జరిగాయి.

ఈ దాడుల్లో కనీసం ముగ్గురు భారతీయులు మరణించారు. ఈ పరిణామాలు భారత షిప్పింగ్‌ కంపెనీలకు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత షిప్పింగ్‌ మంత్రి శర్బానంద సోనోవాల్‌ మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తాజా పరిస్థితిని సమీక్షించారు. భారత నౌకలకు, సిబ్బందిని తగిన రక్షణ కల్పించడానికి భారత నావికాదళం, విదేశాంగ శాఖ, మారిటైమ్‌ రెస్క్యూ కో–ఆర్డినేషన్‌ సెంటర్‌(ఎంఆర్‌సీసీ) సంయుక్తంగా చర్యలు చేపట్టాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement