క‌రోనా రిక‌వ‌రీలో ఏపీ మ‌రింత ముందంజ‌ | 11 Lakh Above Corona Tests In Last 24 Hours In India Says Health Ministry | Sakshi
Sakshi News home page

తగ్గుతున్న పాజిటివ్ రేటు;భార‌త్‌కు ఊర‌ట‌

Sep 3 2020 4:42 PM | Updated on Sep 3 2020 7:20 PM

11 Lakh Above Corona Tests In Last 24 Hours In India Says Health Ministry - Sakshi

ఢిల్లీ : దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 11,72,179 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య‌శాఖ గురువారం త‌న‌ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య 4.5 కోట్లు దాటేసింది. అత్య‌ధిక క‌రోనా ప‌రీక్ష‌ల ద్వారా దేశంలో పాజిటివ్ రేటు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 30వ తేదీ వ‌ర‌కు రోజుకు ప‌దుల సంఖ్య‌లో నిర్వ‌హించిన ప‌రీక్ష‌లు.. ఏడు నెల‌ల్లోనే రోజుకు 11ల‌క్ష‌లకు పైగా  క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇప్పుడు రోజూవారి నిర్వ‌హిస్తున్న ప‌రీక్ష‌ల ద్వారా దేశంలో పాజిటివ్ రేటు గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌డ‌డంతో పాటు మ‌ర‌ణాల రేటు కూడా త‌గ్గ‌డం సానుకూలాంశ‌మ‌ని కేంద్ర‌వైద్యారోగ్య‌శాఖ తెలిపింది. 

ఏపీ మ‌రింత ముందంజ‌
ఇక రాష్ట్రాల వారిగా చూసుకుంటే.. ప్ర‌ధానంగా ఐదు రాష్ట్రాలలో 62% కరోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. వాటిలో మహారాష్ట్రలో 25%, ఏపీలో 12.64 శాతం, కర్ణాటకలో 11.58 శాతం, ఉత్తరప్రదేశ్ లో 7 శాతం, తమిళనాడులో ఆరు శాతం కేసులు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో 37 శాతం కేసులు ఉన్నాయి ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు, మరణాల్లో తగ్గుదల క‌నిపిస్తుంది. ఏపీలో కరోనా యాక్టివ్  కేసులలో ప్రతిరోజు 13.7 శాతం తగ్గుతోంది. రోజువారీ కరోనా మరణాల్లో 4.5 శాతం తగ్గుదల ఉన్న‌ట్లు కేంద్రం పేర్కొంది.

ఏపీలో  ఆగస్టు 13-19 తేదీల మధ్య  1,12,714 కేసులు ఉంటే.. ఆగ‌స్టు 20-26 తేదీల మధ్య 88,612 కేసులు న‌మోద‌య్యాయి. ఆగ‌స్టు 27- సెప్టెంబర్ 2 మధ్య 97, 272  కేసులు న‌మోద‌య్య‌యి. కరోనాతో దేశంలో సంభ‌వించిన మొత్తం మరణాలలో 6.12 శాతం ఏపీలో చోటుచేసుకున్నాయి. రోజూవారి కరోనా కేసుల నమోదులో రెండో స్థానంలో ఉన్నా.. రికవరీ రేటులో మాత్రం ముందంజలో ఉంది. మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుదల 6.9 శాతంగా ఉండ‌గా.. కరోనా మరణాల సంఖ్య 37.39 శాతంగా ఉంది.

కరోనా పరీక్షలు  పెరిగిన కొద్దీ, అదే స్థాయిలో రికవరీ రేటు పెరుగుతోంది .యాక్టీవ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య మూడు రెట్ల పైనే ఉంది. దేశంలో పాజిటివ్ రేటు 1.75శాతానికి ప‌డిపోగా.. రిక‌వ‌రీ రేటు మాత్రం 77.09శాతంతో మ‌రింత మెరుగైంది. ప్ర‌స్తుతం దేశంలో 8ల‌క్ష‌ల 15వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉండ‌గా.. ఈ మొత్తం 21.16శాతంగా ఉన్న‌ట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మిలియన్ కు 3359 కరోనా కేసులు ఉంటే .. భారత్లో 2792 కేసులు ఉన్నాయి. అమెరికాలో ప్రతి మిలియన్ కు 18926 కేసులు న‌మోద‌వుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మిలియన్ కు 111 మంది చనిపోతుంటే .. భారత్‌లో మాత్రం 49 మందే చనిపోతున్నారు. (చదవండి :భారత్‌లో ఒక్కరోజే 83వేల కేసులు) 

కాగా బుధ‌వారం ఉద‌యం నుంచి గురువారం ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు దేశంలో రికార్డు స్థాయిలో 83,883 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 38,53,406కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 1043మంది మృత్యువాతపడగా, మొత్తం 67,376మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 29,70,493 మంది కరోనానుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.(చదవండి : విజృంభిస్తోన్న వైరస్‌.. సత్యేంద్ర జైన్‌ స్పందన)

Advertisement
 
Advertisement
Advertisement