నర్వ: ప్రభుత్వం భూముల ధరలు పెంచడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. శుక్రవారం నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని తెలిసి మండలంలోని పలువురు రైతులు మూడు రోజుల కిందట భూముల రిజిస్ట్రేషన్ కోసం మీ సేవా కేంద్రాల్లో స్లాట్లు బుక్ చేసుకున్నారు. మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఇన్చార్జ్ తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో నిలిచిపోయాయి. శుక్రవారం కార్యాలయానికి రావడంతో సుమారు 40 వరకు భూ రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉన్నట్లు రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలు శుక్రవారం నుంచి అమలులోకి రావడంతో గతంలో స్లాట్ బుక్ చేసుకున్న వారు అదనపు చార్జీలు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్లు అవుతాయని అధికారులు చెప్పడంతో రైతులు తెల్ల మొహం వేశారు. అదనపు చార్జీలు చెల్లించేందుకు మీ సేవా కేంద్రానికి వెళ్తే సైట్ రావడం లేదని చెప్పడంతో అయోమయంలో పడ్డారు. దీనిపై ఇటు అధికారులు, అటు మీ సేవా కేంద్రాల నిర్వాహకులు స్పష్టంగా చెప్పకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.


