జిల్లా ప్రజలకు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి శ్రీపరాభవ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది మన వారసత్వపు పండుగ అని.. ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, కళలు జాతిని సజీవంగా నిలుపుతాయన్నారు. రైతన్నల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని.. వ్యవసాయరంగ అభివృద్ధితో అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిమైందన్నారు. జీవితం కష్టసుఖాల సమ్మేళనమని.. ఉగాది పచ్చడి షడ్రుచుల మాదిరిగానే జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ, ముందుకు సాగాలన్నారు. శ్రీపరాభవ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు దేశం మరింత ప్రగతి సాధించాలని మంత్రి కాంక్షించారు.
పాడిపంటలతో కళకళలాడాలి
పరాభవ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు నింపాలని, పాడిపంటలతో కళకళలాడాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకాంక్షించారు. బుధవారం ఆయన జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు ఉగాది పండుగ ఎంతో విశిష్టమైనదన్నారు. పండుగ రోజున షడ్రుచులు స్వీకరించడం, దైవంతో భక్తి చాటడం చెప్పుకోదగ్గ విశేషమన్నారు. ప్రతి ఒక్కరి భవిష్యత్లో వివరించే పంచాంగం ఇదే రోజు వెలువరించడం ఈ పండుగ ప్రత్యేకత అన్నారు. కొత్త సంవత్సరంలో జిల్లా అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని.. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలని ఆయన కాంక్షించారు.


