
కొత్త కార్డులకు బియ్యం
ఒకటో తేదీ నుంచి పంపిణీకి సన్నాహాలు
● ఏర్పాటు చేస్తున్న పౌరసరఫరాల శాఖ
● పెరిగిన సంఖ్యకు అనుగుణంగా
రేషన్ షాపులకు కోటా కేటాయింపు
●
మాకు పెళ్లయి ఏడేళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. రేషన్కార్డు కోసం మీసేవ దరఖాస్తు చేసుకున్న గతంలో రాలేదు. ఇటీవల మరోసారి దరఖాస్తు చేసుకున్నాం. రేషన్కార్డు మంజూరైంది. చాలా ఆనందంగా ఉంది.
– మహేంద్రమ్మ, భూనీడ్
పాత, కొత్త రేషన్కార్డులు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తాం. కార్డుల్లో పేరు నమోదు చేసుకున్న వారికి సైతం బియ్యం పంపిణీ చేయనున్నాం. జిల్లాలోని కోస్గి, నారాయణపేట, మక్తల్ ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం చేరుతున్నాయి. కొత్త రేషన్ కార్డుల మంజూరు, కార్డులో పేర్ల చేర్పులు నిరంతర ప్రక్రియ. ఇప్పటి వరకు రేషన్కార్డులు లేని వారు మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చు.
– బాల్రాజు, డీఎస్ఓ
మద్దూరు: రేషన్కార్డుల కోసం 11 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పేదల కల నెరవేరింది. జూలై 14న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా రేషన్ కార్డులు అందించారు. దీంతో వారి మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశాల మేరకు కొత్త కార్డుదారులకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి రేషన్ బియ్యం పంపిణీకి అధికార యంత్రాంగం సన్నద్దమవుతోంది. జూన్లో మూడు నెలల రేషన్ బియ్యం లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేసింది. దీంతోపాటు మూడు నెలలుగా ప్రభుత్వం కొత్త రేషన్కార్డుల జారీతో పాటు ఉన్న కార్డుల్లో సభ్యుల పేర్లను నమోదు చేసింది. జిల్లాలో పెరిగిన ఆహారభద్రతా కార్డుల్లోని సభ్యుల సంఖ్యకు అనుగుణంగా సన్నబియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాక అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా..
కొత్త రేషన్కార్డుదారులకు బియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేది ఉంచి యథావిధిగాా పాత కార్డులతో పాటు కొత్త కార్డులకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాకు సెప్టెంబర్ నెల కోటాకు సంబంధించిన సన్నబియ్యం కేటాయించింది. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్షాపులకు బియ్యం తరలింపునకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం చౌకధరల దుకాణాలు, మండల స్థాయి గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యానికి తోడు అదనంగా కావాల్సిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. కొత్తకార్డుల పంపిణీకి ముందు ప్రతి నెల సుమారు 301 షాపుల ద్వారా 1,40,320 కార్డులకు 5,907.55 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. పెరిగిన లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా అదనంగా జిల్లాకు 1,002. 34 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో మూడు ఎంఎల్ఎస్ పాయింట్లు..
జిల్లాలో కోస్గి, నారాయణపేట, మక్తల్ ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి 13 మండలాల్లోని 301 రేషన్ షాపులకు బియ్యం చేరనున్నాయి. స్టేజ్–1 గోదాముల నుంచి ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్లకు సన్నబియ్యం నిల్వల రాక ప్రారంభమైయింది. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి నేరుగా రేషన్ షాపులకు సన్నబియ్యం పంపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

కొత్త కార్డులకు బియ్యం

కొత్త కార్డులకు బియ్యం

కొత్త కార్డులకు బియ్యం