
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
మక్తల్/మాగనూర్: ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి వారికి వెన్నుదన్నుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మాగనూరులో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఇళ్లు లేని నిరుపేదలు దగా పడ్డారని, డబుల్ బెడ్రూంలు కట్టిస్తామని నీటిమీద రాతలాంటి మాయమాటలు చెప్పి మోసపుచ్చారని విమర్శించారు. పదేళ్ల పాలనలో సంవత్సరానికి గ్రామానికి కొన్ని ఇళ్లు ఇచ్చుకుంటూ పోయినా నేటీకి గ్రామాల్లో ఇంత మంది ఇల్లు లేని లబ్ధిదారులు ఉండేవారు కాదని అన్నారు. ఉమ్మడి మాగనూర్, కృష్ణ మండలాలకు 385 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని, ఇందుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.20 కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రేషన్కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి శ్రీమంతులు తినే సన్నబియ్యం అందజేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. ఉచిత కరెంట్, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 కే గ్యాస్ సిలిండర్ల పంపిణీ , రైతులకు బోనస్, రైతు భరోసా ఇస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్నాయక్, డీఈ హరికృష్ణ, ఏఈ అంజనేయులు పాల్గొన్నారు.
క్రీడలపై విద్యార్థుల ప్రత్యేక దృష్టి
మక్తల్: క్రీడలపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మక్తల్లో ఆయన నివాసంలో క్రీడా పాఠశాలల్లో నాల్గో తరగతి ప్రవేశాల కోసం ముద్రించిన వాల్పోస్టర్లను విడుదల చేశారు. విద్యార్థులు మండల, జిల్లా స్థాయి పోటీల్లో రాణించి జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలన్నారు. అనంతరం కన్యకాపరమేశ్వరి, వెంకటేశ్వర, అయ్యప్పస్వామి ఆలయాల్లో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.
కలిసిమెలిసి ఉంటేనే భవిష్యత్
అందరూ కలిసి మెలిసి ఉంటేనే భవిషత్ ఉంటుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం జిల్లా రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి అధ్యక్షతన మక్తల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈకార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రెడ్డి సేవా సమితి భవన నిర్మాణానికి రెండు ఎకరాల భూమిని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. బీసీ బిడ్డగా మంత్రి పదవిని సీఎం ఇవ్వడం జరిగిందని అన్నారు. అనంతరం మంత్రిని శాలువాతో సన్మానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, అనిరుధ్రెడ్డి, పర్ణికారెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డితోపాటు బికేఆర్ చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి, రాదమ్మ, సంతోష్రెడ్డి, వసంత, కుంభం శివకుమార్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, దేవేందర్రెడ్డి, జగన్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.