
1.80 లక్షల మంది ఖాతాల్లో రూ.260 కోట్లు జమ
నారాయణపేట: వానాకాలం – 2025 సీజన్ కు సంబందించి పంట పెట్టుబడి సాయం కింద జిల్లాలో 1,81,109 మంది రైతులకు రూ.260.36 కోట్ల నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తోందని డీఏఓ జాన్సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా మారుస్తూ, రైతులకు బాసటగా నిలవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తోందని తెలిపారు. రైతుల బ్యాంకు ఖాతా వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు ఇప్పటికే రైతు భరోసా పోర్టల్ లో నమోదు చేశారని తెలిపారు. ఈ వివరాలకు అనుగుణంగా గురువారం సాయంత్రం వరకు జిల్లాలోని 1,44,689 మంది రైతుల ఖాతాలలో రూ. 146.55 కోట్ల నిధులు ఇప్పటికే జమ అయ్యాయని తెలిపారు. 4 నుంచి 5 ఎకరాల లోపు 15,096 మంది రైతులకు రూ.40.56 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. 5–6–2025 తేదీలోపు పట్టా పాస్ పుస్తకం పొందిన రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి దరఖాస్తులను 20–6–2025 తేదీలోపు సమర్పించాలని పేర్కొన్నారు. వివిధ కారణాల చేత నాలుగు ఎకరాల లోపు 151 మంది రైతుల అకౌంట్లో నగదు జమ కాలేదని, అట్టి రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి కొత్త అకౌంట్లను సమర్పించాలని తెలిపారు. పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు రైతు భరోసా ఉపయుక్తంగా నిలుస్తుందని తెలిపారు.