
మెరుగైన సేవలు అందించాలి
మద్దూరు: పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశించారు. శుక్రవారం మద్దూరు పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను ఎస్ఐ విజయ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని, విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి సారించి, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు. పాతనేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ రైస్, మత్తు పదార్థాల అక్రమ రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. సిబ్బందికి లేమైన సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోస్గి సీఐ సైదులు, పోలీసులు పాల్గొన్నారు.
వృద్ధులకు ఇబ్బందికలగకుండా చూడాలి
నారాయణపేట: వృద్ధాశ్రమంలోని వృద్ధులకు నిత్యం అందుబాటులో ఉండాలని.. వారికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి వింధ్యనాయక్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు, ఆహారం, వసతులు, పనిచేస్తున్న సిబ్బంది విధులపై ఆరా తీశారు. ఆహార ధాన్యాల నాణ్యత, తాగు నీరు, పరిశుభ్రత, సీసీటీవీ ఫుటేజీలు, మూ మెంట్ రిజిష్ట్రర్లను పరిశీలించారు. మెనూ ప్రకారం ప్రతి రోజు కూరగాయలు తాజాగా కొనుగోలు చేయాలని, వృద్ధులకు ఎప్పటికప్పుడు మందులు అందజేయాలని, గదులను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు.
గురుకులంలో అడిషనల్ కలెక్టర్ బస
ధన్వాడ: మండలంలోని కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాలను శుక్రవారం రాత్రి అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పరిశీలించారు. రాత్రి 10 గంటల సమయంలో పాఠశాలకు చేరుకున్న ఆయన తాగునీటి సౌకర్యం, ప్రహరీ నిర్మాణం, విద్యార్థుల గదులు, పరిసరాలను పరిశీలించారు. ప్రిన్సిపల్ రాజారాంతో మాట్లాడారు. గదుల్లో ఫ్యాన్లు, ఆట స్థలం ఏర్పాటు చేయాలని, సమీపంగా ఉన్న కొండను తొలచాలని అడిషనల్ కలెక్టర్కు విన్నవించారు. అనంతరం పాఠ్యాంశాలు అర్థమయ్యేలా బోధిస్తున్నారా, భోజనం ఎలా ఉంది అని విద్యార్థులతో ఆరా తీస్తూ సమస్యలు ఏమైనా ఉంటే తనకు తెలియజేయాలన్నారు. అనంతరం గురుకులంలోనే అడిషనల్ కలెక్టర్ బస చేశారు.

మెరుగైన సేవలు అందించాలి

మెరుగైన సేవలు అందించాలి