‘సంకెళ్ల ఘటన’లు పునరావృతం కానివ్వం | - | Sakshi
Sakshi News home page

‘సంకెళ్ల ఘటన’లు పునరావృతం కానివ్వం

Jun 21 2025 3:21 AM | Updated on Jun 21 2025 3:21 AM

‘సంకెళ్ల ఘటన’లు పునరావృతం కానివ్వం

‘సంకెళ్ల ఘటన’లు పునరావృతం కానివ్వం

మహబూబ్‌నగర్‌ క్రైం: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌ కోర్టుకు రైతులను తీసుకువెళ్తున్న ఘటనలో రైతుల చేతులకు సంకెళ్లు వేయడంపై ఎస్కార్ట్‌ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు అతి జాగ్రత్తతోపాటు ఎక్కువగా రక్షణాత్మకంగా ఉండాలని వ్యవహరించడం వల్లే ఈ తప్పిదం జరిగిందని మల్టీ జోన్‌– 2 ఐజీ సత్యనారాయణ అన్నారు. అలంపూర్‌, సంగారెడ్డి కోర్టులలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, భవిష్యత్‌లో ఇలాంటివి మళ్లీ జరగకుండా ప్రత్యేక ఎస్‌ఓటీ తయారు చేసినట్లు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐజీ మాట్లాడారు. ఉన్నతాధికారులకు విషయం తెలియకపోవడంతోపాటు స్థానిక ఎస్‌హెచ్‌ఓ సక్రమంగా మానిటరింగ్‌ చేయకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. రైతుల ఘటన విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదని, ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. భవిష్యత్‌లో ఎక్కడా కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికి ఎస్‌ఓటీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, దీనికి సివిల్‌ డీఎస్పీతోపాటు ఏఆర్‌ డీఎస్పీ పూర్తి బాధ్యత వహిస్తారని చెప్పారు. కొత్తగా వచ్చిన బీఎన్‌ఎస్‌ నిబంధనల ప్రకారం ఖైదీలకు ఇచ్చే ఎస్కార్ట్‌ విషయంలో ఆస్పత్రికి వెళ్లే సమయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని జైలు అధికారుల నుంచి ఎస్పీలకు సమాచారం వస్తుందన్నారు. ఖైదీలను తరలించే సమయంలో సమన్వయ, సమాచారం లోపం ఉండకుండా ఉండటానికి ఎస్పీ స్థాయిలో ఎస్‌బీ, లా అండ్‌ ఆర్డర్‌, రిజర్వ్‌ పోలీసులు కలిసి అన్ని జాగ్రత్తలు తీసుకునే క్రమంలోనే నూతనంగా ఎస్‌ఓటీ తయారు చేశామన్నారు. జైలు నుంచి ఖైదీలను ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రికి లేదా కోర్టుకు తీసుకువెళ్తున్న క్రమంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఇకపై జైలు నుంచి ఖైదీలను తీసుకువెళ్తున్న క్రమంలో వారి గత నేర చరిత్ర ఆధారంగా చేసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంకెళ్ల విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రైతులు, వికలాంగులు, విద్యార్థులు, మహిళలను కోర్టుకు తీసుకువెళ్తున్న క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఐదు జిల్లాల పోలీస్‌ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. సంకెళ్లు వేయాల్సిన పరిస్థితి వస్తే సదరు కోర్టు న్యాయమూర్తి అనుమతి ప్రకారం వేయాలని, అదేస్థాయిలో బీఎన్‌ఎస్‌ యాక్ట్‌ ప్రకారం టెర్రరిస్టులు, నక్సలైట్లు, గతంలో నేర చరిత్ర కలిగినవారు అయితే పోలీస్‌ ఉన్నతాధికారుల అనుమతి కూడా తీసుకోవాలన్నారు.

రైతుల అభిప్రాయాలు సైతం..

పెద్దధన్వాడ ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, అదే సమయంలో రైతుల అభిప్రాయాలు సైతం సముచితంగా తీసుకొని చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కసారి ఖైదీలను రిమాండ్‌ చేసిన తర్వాత మళ్లీ తర్వాత బెయిల్‌ అప్లికేషన్‌ సందర్భంతోపాటు ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం వెళ్లిన సందర్భంలో ముఖ్యంగా లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు వాటిపై తక్కువ ఫోకస్‌ పెడుతున్నారని తెలిపారు. సమావేశంలో జోగుళాంబ జోన్‌–7 డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌, ఉమ్మడి జిల్లాలోని ఎస్పీలు జానకి, వైభవ్‌ గైక్వాడ్‌, రావుల గిరిధర్‌, తోట శ్రీనివాస్‌రావు, యోగేష్‌ గౌతం తదితరులు పాల్గొన్నారు.

కానిస్టేబుళ్ల అతి జాగ్రత్త వల్లే తప్పిదం జరిగింది

మల్టీ జోన్‌–2 ఐజీ సత్యనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement