● జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి
నంద్యాల: అనంతపురంలో సెప్టెంబర్ 6న మెగా కృత్రిమ చేతుల అమరిక శిబిరాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు రాజకుమారి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ ఇంటర్నేషనల్, ఎల్ఎన్–4 హ్యాండ్స్, చేయూత ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. శిబిరంలో రూ.30 వేల విలువైన అత్యాధునిక కృత్రిమ చేతులను ఉచితంగా అమరుస్తారన్నారు. నంద్యాల జిల్లాకు చెందిన లబ్ధిదారులు ముందస్తుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఎల్ఎన్–4 హ్యాండ్స్ సాంకేతికతతో రూపొందించిన ఈ కృత్రిమ చేతులతో రాయడం, పెయింటింగ్ చేయడం, ఆహారం తీసుకోవడం, నీరు తాగడం వంటి రోజువారీ కార్యకలాపాలను సులభంగా నిర్వహించుకోవచ్చన్నారు. అలాగే నాలుగు కిలోల వరకు శిబిరానికి సంబంధించి రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం నంద్యాల కేసీ కెనాల్ కాంపౌండ్ ఆవరణలోని రెడ్ క్రాస్ కార్యాలయాన్ని, 8985770583 మొబైల్ నంబర్ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి, సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, కమిటీ సభ్యుడు ఉస్మాన్ బాషా పాల్గొన్నారు.


