● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నందికొట్కూరు: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి ఓర్వకల్లు ఇండిస్ట్రియల్కు నీటి సరఫరా పైపులైన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన పైపులైన్ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పైపులైన్ పనులు ఎందుకు జాప్యం జరుగుతున్నాయని వివరాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైపులైన్ పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పారిశ్రామిక, ప్రజలకు తాగునీరు అవసరాల దృష్ట్యా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి పైపులైన్ పనులు చేపట్టామన్నారు. పనులు ప్రణాళిక బద్ధంగా నిర్వహించి నిర్ణీత కాలవ్యవధిలోనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏపీఐఐసీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పైపులైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనుమతులు లేకుండా వేసిన అక్రమ వెంచర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నీటిముంపు నిరుద్యోగులు జిల్లా కలెక్టర్ను కలిసి 70 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ వెంట ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మధుసూదన్రెడ్డి, ఆర్డీఓ వెంకట శివ, తహసీల్దార్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ జి. వెంకటరెడ్డి, టీపీఓ రంగస్వామి, తదితరులు పాల్గొన్నారు.


