చంద్రబాబు ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. 2024–25, 2025–26 సంవత్సరాల్లో రైతులను యూరియా కొరత తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఈ సారి ప్రభుత్వం యాప్ ద్వారా యూరియాను విక్రయించాలని నిర్ణయించింది. ఒకటి, రెండు రోజుల్లో యాప్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్లో 2025–26 సంవత్సరానికి సంబంధించి ఈ–క్రాప్ డేటా ఉంటుంది. ఈ సారి కూడా అదే పంట వేస్తే ఎన్ని బ్యాగుల యూరియా అవసరం అనేది ఇట్టే తెలిసిపోతుంది. కొత్త పంటకు మారితే యూరియా ఎంత అవసరమనే రెకమెండేషన్ కూడా ఉంటుంది. యాప్ ద్వారా యూరియా పంపిణీకి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైన యూరియా రెండు లేదా మూడు దఫాలుగా పంపిణీ చేస్తారు. డిమాండ్ మేరకు పంపిణీ చేయకుండా యాప్ పేరుతో షరతులు విధిస్తుండటం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.


