ఆళ్లగడ్డ: నవనారసింహ స్వాములు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శనివారం భక్తులతో కిక్కిరిసి గోవింద నామస్మరణతో మార్మోగింది. పాములేటయ్య వారాలు ముగింపునకు వస్తున్న సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఎగువ, దిగువ క్షేత్రాలతో పాటు పావన క్షేత్రం తెల్లవారు జామునుంచే భక్తులతో కిటకిటలాడింది. స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి తలనీలాలు సమర్పించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.


