మహానంది: మహానందిలో శుక్రవారం నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ. 60.18 లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. స్థానిక అభిషేక మండపంలో శ్రీ కామేశ్వరీదేవి సమిత శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయాలతో పాటూ కోదండరామాలయం , ఆంజనేయ స్వామి, వినాయక నంది ఆలయాల్లో హుండీ కానుకలను లెక్కించారు. ఆలయాల ద్వారా రూ. 59,21,476, అన్న ప్రసాదం విభాగం ద్వారా రూ. 69, 515, గోసంరక్షణ ద్వారా రూ. 27,176 వచ్చినట్లు తెలిపారు. నగదు కానుకలతో పాటు రెండు గ్రాముల 950 మిల్లీ గ్రాముల బంగారు, 260 గ్రాము వెండి లభించినట్లు వివరించారు. మొత్తం 60 రోజులకు ఈ ఆదాయం వచ్చినట్లు చెప్పారు. హుండీ కానుక లెక్కింపు కార్యక్రమంలో వెలుగోడు గ్రూపు టెంపుల్స్ ఈఓ జనార్దన శెట్టి, మహానంది ఎఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్ రెడ్డి, నీలకంఠేశ్వర రాజు, సుబ్బారెడ్డి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.


