ప్యాపిలి: టీడీపీ గురించి గొప్పతనం చెప్పడానికి మహానాడు కార్యక్రమానికి హాజరైన డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ప్రజల సమస్యకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలోని స్థానిక షాదీఖానాలో గురువారం మహానాడు కార్యక్రమం నిర్వహించారు. సమావేశానికి హాజరైన డోన్ ఎమ్మెల్యేను గార్లదిన్నె గ్రామ మహిళలు చుట్టముట్టారు. నీటి సమస్య గురించి నిలదీశారు. గార్లదిన్నెలోని కొత్త బిల్డింగ్స్ కాలనీకి గత మూడు రోజులుగా మంచినీరు రావడం లేదని, ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. మహానాడులో ప్రసంగాలు వినకుండా మహిళలు నీటి సమస్యపై ప్రశ్నించడంతో ఎమ్మెల్యే ఖంగుతిన్నారు. ఊహించని సంఘటన నుంచి తేరుకున్న అనంతరం త్వరలోనే నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


