నంద్యాల(వ్యవసాయం): న్యాయ వ్యవస్థలో న్యాయవాది కీలక స్తంభమని హైకోర్టు న్యాయమూర్తి ఏ.హరిహరనాథశర్మ అన్నారు. బుధవారం స్థానిక రామకృష్ణ పీజీ కళాశాలలో నంద్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ.. కోర్టుల్లో డిజిటల్ ఫైలింగ్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ వేగవంతం చేయవచ్చన్నారు. లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం, కోర్టు వెలుపల రాజీద్వారా కేసులను త్వరగా పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రతి కేసుకు టైమ్లైన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. న్యాయవాది కోర్టులో చట్టపరంగా బలమైన వాదనలు వినిపించాలని, చట్టం ప్రకారం ఏది సరైనదో క్లయింట్కు వివరించాలన్నారు. నిజాన్ని వెలికి తీయడంలో కోర్టుకు సహకరించాలని, అబద్ధం చెప్పకూడదన్నారు. పేదలకు, సమాజానికి సంబంధించిన కేసులను ఉచితంగా వాదించాలన్నారు. సకాలంలో న్యాయం అందాలంటే సాంకేతికతను వాడుకోవాలని, వాయిదాల సంస్కృతిని తగ్గించడానికి ప్రతి న్యాయవాది సహకరించాలన్నారు. అనంతరం సీనియర్, జూనియర్ న్యాయవాదులు అడిగిన సమస్యలకు పరిష్కార మార్గాలను తెలియజేశారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు జడ్జిని సత్కరించారు. నంద్యాల మూడో అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజ, రామసుబ్బయ్య, అడ్డగాళ్ల వెంకటేశ్వర్లు, జీవీఎన్ ప్రసాద్, ప్రతాపరెడ్డి, గౌరీశంకర్, రామచంద్రారావు, శివశంకర్రెడ్డి, వివేకానందరెడ్డి తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


