వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి
ఓటు చోర్ జరగకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్ఏలదే
ప్రతి ఇంటిలో ఓటర్లపై అవగాహన పెంచుకోండి
టీడీపీ దొంగ ఓట్లను జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోండి
ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని
కర్నూలు(సెంట్రల్): సర్ కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకుని 2029 ఎన్నికల్లో మరోసారి ఓటు చోరీ చేసి అధికారంలోకి రావాలనే సీఎం చంద్రబాబునాయుడు కుట్రను వైఎస్సార్సీపీ బీఎల్ఏలు తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలు నగర శివారులోని హ్యాంగౌట్ హోటల్లో పాణ్యం నియోజకవర్గ బీఎల్ఏలకు సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, పాణ్యం నియోజకవర్గ పరిశీలకులు గుండం సూర్యప్రకాష్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సర్ పేరుతో అనేక రాష్ట్రాల్లో లక్షల ఓట్లు తొలగించారని, ఏపీలోనూ నియోజకవర్గానికి 20 వేల ఓట్లను తొలగించాలన్న కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత బూత్ లెవల్ ఏజెంట్లపై ఉందన్నారు. ప్రతి బీఎల్ఏ తన పరిధిలోని బూతు ఓటర్లపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎవరైనా వైఎస్సార్సీపీ సాను భూతి పరుల ఓట్లను తొలగించాలని యత్నిస్తే ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు దొంగ ఓట్లు చేర్చి మరోసారి దొడ్డిదారిలో అధికారంలోకి రావాలని చూస్తున్నారని, వారి కుట్రలను సాగనీయవద్దని హెచ్చరించారు. భవిష్యత్లో బీఎల్ఏలే పార్టీలో కీలకమని, వారు పార్టీ నాయకులుగా ఎదిగే అవకాశం వస్తుందన్నారు. పార్టీ కోసం ఇప్పుడు కష్టపడితే జగనన్న సీఎం అవ్వగానే వారికి పార్టీ, ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, 2029లో మాత్రం కార్యకర్తల ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని, అప్పుడు అనుకున్న లక్ష్యాలను సాధించుకోవచ్చన్నారు.
టీడీపీ నేతలకు దోచుకోవడమే పని
కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దోచుకుని దాచుకోవడం తప్ప ఏమీ చేయడం లేదని.. ఇసుక, గ్రావెల్కు తెలుగు తమ్ముళ్లు టిప్పర్కు రూ.500 వసూలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆరోపించారు. ఎవరికై నా అనుమానం ఉంటే తన వెంట వస్తే ఏ టీడీపీ నాయకుడు ఎంత వసూలు చేసింది చూపిస్తానని, ఇందుకు దమ్ముంటే ముందుకు రావాలని సవాల్ విసిరారు. మంగళవారం పాణ్యం నియోజకవర్గ బీఎల్ఏల సమావేశం కర్నూలు శివారులోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పి.. వాళ్ల పార్టీ నేతల జేబులు నింపుతున్నాడని ఆరోపించారు. నంద్యాల జిల్లాలో పబ్లిక్గా టీడీపీ నాయ కులు ఇసుక, గ్రావెల్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారని, టిప్పర్ ఇసుకకు రూ.500, టిప్పర్ గ్రావెల్కు రూ.5 వేలు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై అధికారులకు చెప్పినా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్లో భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు కాకుండా టీడీపీ నాయకులకు ఉద్యోగాలు ఇస్తున్నారని, 75 శాతం స్థానికులకు ఇవ్వాలని చట్టం ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. జయరాజ్ ఇస్పాత్, క్యాంపకోలా కంపెనీల్లో మంత్రి టీజీ భరత్ తన అనుచరులకు ఉద్యోగాలు ఇప్పంచుకుంటున్నారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ హబ్ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం ఇవ్వకుండా టీడీపీ, వైఎస్సార్సీపీ అని వేరు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో దాదాపు 9వేల ఎకరాల భూములను హబ్ కోసం తీసుకున్నా ఎక్కడా పరిహారం రాలేదన్న మాట వినిపించలేదన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓర్వకల్ మండల రైతులు కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ పరిహారం కోసం తిరుగుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కర్నూలు నగరంలో వెంటకరమణ కాలనీ, కృష్ణానగర్లో ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించామని, టీజీ భరత్ ఒక్కటైనా ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ కూడా తమ హయాంలోనే ఎక్కువగా అభివృద్ధి చెందిందని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి హైదరాబాద్ – బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో నోడ్ పాయింట్గా గుర్తించామని, 9 వేల ఎకరాల భూసేకరణ చేసి ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేశామని, ఇప్పుడు మంత్రి టీజీ భరత్ తన హయాంలోనే మొత్తం జరిగినట్లు చెప్పడం దారుణమన్నారు. కాగా టీడీపీ నాయకులు చెప్పగానే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, అక్రమ కేసులు పెడితే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.


