రాజులు, రాజ్యాలు కాల గర్భంలో కలసిపోయాయి. అయినా ఆ నాటి వైభవం శిల్పాలు, శిలా శాసనాల ద్వారా బయటపడుతూనే ఉంది. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితం నాటి అరుదైన రాతి చిత్రం చెత్తపాలవుతున్నా పట్టించుకునేవారు లేరు. తాటిపాడు గ్రామ సమీపంలోని ఎత్తిపోతల పథకం పంప్హౌస్ వద్ద చెత్తకుప్పల్లో ఓ రాతి చిత్రం కొన్నాళ్లుగా అక్కడే ఉన్నా అధికారులు అటు వైపు చూడటం లేదు. ఎవరో రాజు గుర్రంపై కూర్చుని ఈటెతో అటవీ జంతు వును వేటాడుతున్నట్లుగా బండ రాయిపై చెక్కిన చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. పూర్వం గద్వాల సంస్థానం రాజులు కృష్ణా, తుంగభద్ర నదుల తీరం వెంట ఉన్న నల్లమల ప్రాంతానికి చేరుకొని వేటాడే వారని, ఆ క్రమంలో ఎవరైనా రాజు తన చిత్రాన్ని బండరాయిపై చెక్కించినట్లుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. రాతి చిత్రాన్ని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించి భవిష్యత్ తరాలకు భద్రపరచాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.
– జూపాడుబంగ్లా


