నందికొట్కూరు: వెంటనే నీటిముంపు నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆ సంఘం నాయకులు జయన్న హెచ్చరించారు. పట్టణంలోని కర్నూలు–గుంటూరు ప్రధా న రహదారిపై శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులు చేపట్టిన రిలే దీక్ష ఆదివారానికి 60వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి రైతులది త్యాగం అయితే శ్రీశైలం ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన తమది త్యాగం కాదా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు నీటిముంపు నిరుద్యోగులకు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు స్పందించకపోవడం మోసం చేయడమేనన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. 98 జీవో కింద అధికారంలోకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చేతులు ఎత్తేయడం దుర్మార్గమన్నారు. 1,085 లస్కర్ ఉద్యోగాలు నీటిముంపు నిరుద్యోగులకు ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైతే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృత్తం చేస్తామని హెచ్చరించారు. దీక్షలో నాయకులు నాగసుంకన్న, నారాయణ, నాగేంద్రుడు, పఠాన్ సాహెబ్ ఖాన్, తదితరులు కూర్చున్నారు.


